New Jobs: టెన్త్‌ అర్హతతో 11వేలకు పైగా ఉద్యోగాలు.. అప్లై చేశారా?

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ 11వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏప్రిల్‌లో రాత పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించింది.

Updated : 19 Jan 2023 18:47 IST

దిల్లీ: పదో తరగతి అర్హతపై భారీగా ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(SSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పలు శాఖల్లో దాదాపు 11,409 మల్టీ టాస్కింగ్‌ (నాన్‌ టెక్నికల్‌) స్టాఫ్‌ (MTS), హవల్దార్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. వీటిలో దాదాపు 10,880 పోస్టులు మల్టీ టాస్కింగ్‌ సిబ్బంది కాగా.. 529 హవల్దార్‌ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకొనేందుకు తుది గడువు ఫిబ్రవరి 17 రాత్రి 11గంటల వరకు ఇచ్చింది. అలాగే, ఫీజు చెల్లింపునకు మాత్రం ఫిబ్రవరి 19వ తేదీ వరకు అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు ఏప్రిల్‌లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) ఉంటుందని ఎస్‌ఎస్‌సీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే, పూర్తిగా ఎన్ని ఖాళీలు అనేది మాత్రం వివరంగా వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్టు తెలిపింది.

ఎంటీఎస్‌ ఉద్యోగాలకు వయో పరిమితి 18 నుంచి 25 ఏళ్లు కాగా.. హవల్దార్‌ ఉద్యోగాలకు మాత్రం 18 నుంచి 27 ఏళ్లు మించరాదని పేర్కొంది. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు పాటు వయో పరిమితిలో సడలింపు ఇచ్చింది. దరఖాస్తు రుసుం రూ.100గా నిర్ణయించిన ఎస్‌ఎస్‌సీ.. ఆన్‌లైన్‌లోనైనా, లేదా బ్యాంకులోనైనా చలానా తీసి పంపించవచ్చని సూచించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌సీ అధికారులు.. తెలంగాణలోని హైదరాబాద్‌; కరీంనగర్‌, వరంగల్‌ సీబీటీ పరీక్ష రాసేందుకు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సీబీటీ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. హిందీ, ఇంగ్లిష్‌, తెలుగుతో పాటు మరో 12 ప్రాంతీయ భాషల్లోనూ ఈ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. రాతపరీక్ష ఆబ్జెక్టివ్‌ టైప్‌లోనే ఉంటుందని, సెషన్‌ 1కు నెగిటివ్‌ మార్కులు ఉండవని తెలిపారు. సెషన్‌ 2 పరీక్షకు మాత్రం నెగెటివ్‌ మార్కులు ఉంటాయని స్పష్టంచేశారు. ఒక తప్పు సమాధానానికి ఒక మార్కు మైనస్‌ చేస్తామని వెల్లడించారు. అందువల్ల అభ్యర్థులు సమాధానాలు రాసేటప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు https://ssc.nic.in/ క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని