అసోం ‘టీ’.. దాని కథేంటీ?

మరికొన్ని రోజుల్లో దేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరగబోతున్నాయి. వాటిలో ఒకటి అసోం. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆ రాష్ట్రంలో పర్యటించారు. అసోంను టీ సిటీ ఆఫ్‌ ఇండియా అని పిలుస్తారనే విషయం తెలిసిందే. ఈ రాష్ట్రంలో తేయాకును

Updated : 07 Mar 2021 15:11 IST

మరికొన్ని రోజుల్లో దేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరగబోతున్నాయి. వాటిలో ఒకటి అసోం. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆ రాష్ట్రంలో పర్యటించారు. అసోంను టీ సిటీ ఆఫ్‌ ఇండియా అని పిలుస్తారనే విషయం తెలిసిందే. ఈ రాష్ట్రంలో తేయాకును ఎక్కువ పండిస్తుంటారు. అందుకే, అక్కడి టీ తోటల్లో కూలీలతో కలిసి ప్రియాంక గాంధీ తేయాకు సేకరించారు. ఇక్కడి తేయాకుకు మన దేశంతోపాటు రష్యా, యూఎస్‌, ఆస్ట్రేలియా, ఇరాన్‌ వంటి అనేక దేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ తేయాకుల్లో ఉండే కెఫిన్‌ మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. మనిషి ఆరోగ్యంగా ఉండటంలోనూ దోహదపడుతుంది. మరి భారతీయులు ఎంతో ఇష్టంగా తాగే ఈ టీని.. టీ తయారీకి వాడే తేయాకును అసలు ఎవరు కనుగొన్నారు? దేశంలో అత్యధిక తేయాకు పంటలు అసోంలోనే ఎందుకు ఉన్నాయి? తెలుసుకుందాం పదండి..

ప్రపంచంలో చైనా తర్వాత తేయాకు ఉత్పత్తిలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ఇందుకు ముఖ్య కారణం అసోం రాష్ట్రమే. ఏటా 60కోట్ల కిలోలకుపైగా తేయాకు ఇక్కడే ఉత్పత్తి అవుతోంది. దేశంలో ఉత్పత్తి అయ్యే తేయాకులో సగం ఈ రాష్ట్రం నుంచే రావడం విశేషం. దేశంలో తొలిసారి తేయాకును వాణిజ్యపరంగా విక్రయించింది ఈ రాష్ట్రంలోనే. ఇక్కడ దాదాపు 22లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వందల సంఖ్యంలో టీ తోటలు ఉన్నాయి. వీటిలో అతిపెద్ద టీ తోట మోనాబారీ టీ ఎస్టేట్‌. చరియలి జిల్లాలోని బిస్వానాథ్‌ ప్రాంతంలో ఉన్న ఈ ఎస్టేట్‌ 1,158 హెక్టార్లలో విస్తరించి ఉంది. 

టీ పుట్టిందిలా..

మొట్టమొదటగా టీని చైనాలో కొనుగొన్నారు. క్రీస్తుపూర్వం 2,737లో షెన్‌ నాంగ్‌ అనే చక్రవర్తి ఉండేవాడట. ఎంతో తెలివైన రాజు.. శాస్త్రవేత్త కూడా. ఓ రోజు తన కోటలోని తోటలో ఆయన కూర్చొని ఉన్నారట. పనిమనిషి రాజు తాగడానికి మంచినీటిని వేడి చేస్తుండగా కొన్ని ఆకులు గాలిలో తేలియాడుతూ వచ్చి వేడి చేస్తున్న నీటిలో పడ్డాయట. ప్రయోగాలు చేయడం షెన్‌కు అలవాటే కాబట్టి.. ఆకు పడిన నీటిని అలాగే తాగేశాడు. రుచి బాగుండటంలో ఆ ఆకులు ఏ చెట్టువో కనిపెట్టి వాటితో టీ తయారు చేయడం మొదలుపెట్టారు. అలా తొలిసారి టీ రుచి మానవుడికి తెలిసింది. 

అసోంలో టీ..?

1660కాలంలో మన దేశంలో తేయాకును ఔషధంగా ఉపయోగించారు. దేశంలోని వివిధ ప్రాంతాలో పండే తేయాకును తలనొప్పి, కడుపునొప్పి వచ్చినప్పుడు నీళ్లలో వేసి.. నిమ్మరసం కలిపి తాగేవారు. 18వ శతాబ్దంలో స్కాంట్లాండ్‌ ప్రజలు వ్యాపారుస్తులుగా భారత్‌లోకి వచ్చారు. రాబర్ట్‌ బ్రూస్‌ అనే వ్యక్తి కూడా అలాగే భారత్‌కు వచ్చాడు. అయితే, 1823లో అసోంలోని రంగ్‌పుర్‌లో తేయాకు చెట్లు పెరుగుతుండటాన్ని ఆయన గుర్తించాడు. అప్పటికే సింగ్‌పోస్‌ తెగ ప్రజలు ఈ తేయాకులను పండిస్తున్నారు. వాటిని పరిశీలించిన బ్రూస్‌ చైనాలోని పండే తేయాకు లాంటిదే ఇక్కడ పెరుగుతున్నట్లు నిర్థారించాడు. ఆ తర్వాత బ్రిటీష్‌ పరిపాలకులు 1839లో అసోం టీ కంపెనీ ఒకటి స్థాపించి తేయాకును పండించడం మొదలుపెట్టారు. వారి వద్ద పనిచేసిన మణిరామ్‌ దివాన్‌ అనే భారతీయుడు ఉద్యోగం మానేసి సొంతంగా తేయాకు తోటల్ని ఏర్పాటు చేసి, టీ పౌడర్‌ విక్రయించడం ప్రారంభించాడు. అలా 1862 నాటికి అసోం ప్రాంతంలో 160 తేయాకు తోటలు వెలిశాయి. ప్రస్తుతం 800కుపైగా తేయాకు తోటలు ఉన్నాయి. రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఐదుగురిలో ఒక్కరు తేయాకు తోటల్లోనే పని చేస్తుంటారట. 

టీ గార్డెన్‌ టైమ్‌ అంటే!

టైం జోన్‌ ప్రకారం ప్రపంచంలో ఒక్కో దేశంలో ఒక్కో సమయం ఉంటుంది. భారత్‌లోనూ ఇండియన్‌ స్టాండర్డ్‌ టైంను అనుసరిస్తాం. కానీ, అసోంలోని తేయాకు తోటల్లో సమయం ఐఎస్‌టీ సమయం కన్నా ఒక గంట ముందుంటుంది. దీన్నే ‘టీ గార్డెన్‌ టైమ్‌’ అని పిలుస్తుంటారు. దేశప్రధాన భూభాగంతో పోలిస్తే ఈశాన్య ప్రాంతాల్లో సూర్యుడు తొందరగా ఉదయిస్తాడు. ఉదయం పూట తొందరగా వచ్చే వెలుతురుతో తేయాకు ఉత్పత్తిని పెంచుకోవాలని అప్పటి బ్రిటీష్‌ పాలకులు యోచించారు. దీంతో కూలీలను ఉదయం ఒక గంట ముందుగా తోటల్లో పనులకు రావాలని సూచించారు. అంటే దేశంలో ప్రజలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పని చేస్తే.. తేయాకు తోటల్లో ప్రజలు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనులు చేస్తారు. సాయంత్రం తొందరగా ఇంటికి వెళ్తామన్న ఉత్సాహంతో కూలీలు పని వేగంగా చేస్తారని ‘టీ గార్డెన్‌ టైమ్‌’ను తీసుకొచ్చారు. ఇప్పటికీ తేయాకు తోటల్లో ఈ సమయాన్నే పాటిస్తున్నారు. ఈ టీ గార్డెన్‌ టైమ్‌ స్ఫూర్తితో ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక టైం జోన్‌ కావాలంటూ చాలాకాలంగా అక్కడి నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. కానీ, దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని