శూన్యం నుంచి సుస్థిర అభివృద్ధి వైపు..

అభివృద్ధికి, రాజకీయానికి స్పష్టమైన విభజన రేఖ గీసుకోని ప్రగతి పథంలో దూసుకెళ్తోంది గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని పెదరావూరు గ్రామం....

Published : 02 Feb 2021 22:14 IST

కలిసికట్టుగా ముందుకు సాగుతున్న గ్రామస్థులు

ఇంటర్నెట్ డెస్క్‌: ఆ ఊర్లో ఎన్నికల వరకే రాజకీయం. ఆ తర్వాత అంతా అభివృద్ధి మంత్రమే. ఊరి బాగు కోసం కలిసి నడుస్తారు. అందుకే గతుకుల రోడ్లు కాస్తా సాఫీగా మారాయి. కనీస వసతులు లేని స్థితి నుంచి మెరుగైన మౌలిక వసతులు వచ్చేశాయి. అభివృద్ధికి, రాజకీయానికి స్పష్టమైన విభజన రేఖ గీసుకోని ప్రగతి పథంలో దూసుకెళ్తోంది గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని పెదరావూరు గ్రామం. 2001కి ముందు అక్కడ సరైన రోడ్లు లేవు. ఆలయాలు అవసాన దశలో ఉండేవి. స్మశానం దుర్భరంగా ఉండేది. ఈ పరిస్థితే ఆ గ్రామస్థులను ఏకతాటిపైకి తెచ్చింది. తమ ఊరుని బాగుచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో పుట్టి, పెరిగి ఇతర ప్రాంతాల్లో వ్యాపారులుగా స్థిరపడ్డవారు గ్రామాభివృద్ధికి ముందుకొచ్చారు. కొడాలి రమణకుమార్‌ అనే వ్యాపారి గ్రామాభివృద్ధిలో సింహభాగం భరిస్తానని ముందుకొచ్చారు. మరికొందరు వ్యాపారులు, గ్రామస్థులు కూడా తమవంతు సహకారం అందించారు.

గ్రామాభివృద్ధిలో భాగంగా శివాలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు. పురాతన శైలి దెబ్బతినకుండా రామాలయాన్ని ఆధునీకరించారు. స్వామివారి కల్యాణ మండపం నిర్మించారు. గ్రామ రెవెన్యూ కార్యాలయం, ఆరోగ్య కేంద్రం, గ్రంథాలయం, బస్‌ షెల్టర్‌, వ్యవసాయ సహకార సంఘం భవనం వంటివి నిర్మించుకున్నారు. ఇందులో రూ.కోటికి పైగా రమణకుమార్‌ సమకూర్చారు. స్మశానం అభివృద్ధికి వెనిగళ్ల సురేష్‌ రూ.30 లక్షలు అందించారు. ఓ పార్కు మాదిరిగా దాన్ని తీర్చిదిద్దారు. మరణానంతర కార్యక్రమాల నిర్వహణకు కర్మశాల కూడా నిర్మించారు. పొలాలకు వెళ్లే రోడ్డును అభివృద్ధి చేసుకున్నారు. రాజకీయాలను కేవలం ఎన్నికల వరకే పరిమితం చేశారు పెదరావూరు గ్రామస్థులు. అభివృద్ధి విషయంలో అంతా ఏకమై కలిసికట్టుగా ముందడుగు వేస్తున్నారు.

ఇవీ చదవండి...

హైదరాబాద్‌ మెట్రోలో గుండే తరలింపు..

జైలులో పద్మజ కేకలు
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని