Andhra news: ‘పింఛన్లు భిక్ష కాదు.. మా హక్కు’.. విశ్రాంత ఉద్యోగుల పోరుబాట
పింఛన్లు సకాలంలో చెల్లించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా విశ్రాంత ఉద్యోగులు ఆందోళనకు దిగారు. వివిధ చోట్ల అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
అమరావతి: పింఛన్ల (Pension) కోసం విశ్రాంత ఉద్యోగులు (Retired employees ) పోరుబాట పట్టారు. ఎప్పుడూ ఒకటో తేదీనే వచ్చే పింఛన్ గత మూడేళ్లుగా ఎప్పుడొస్తుందో తెలియక అవస్థలు పడుతున్నామంటూ రాష్ట్రంలోని పలు కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు దిగారు. ‘పింఛన్లు భిక్ష కాదు.. మా హక్కు’ అంటూ నినదించారు. తెల్లారితే నాలుగు మెతుకులు లేకపోయినా బతకగలం కానీ, సమయానికి మందులు వేసుకోకపోతే జీవించలేమంటూ.. విశ్రాంత ఉద్యోగులు వాపోతున్నారు.
సర్వీసులో ఉన్నంత కాలం.. ఉరుకుల పరుగుల జీవితంతో అలసి పోయిన ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత సైతం పింఛన్ల కోసం పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరమని విశ్రాంత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదో తేదీ వస్తున్నా ప్రభుత్వం పింఛన్లు చెల్లించకపోవడంతో.. ఎన్టీఆర్ జిల్లా ఉద్యోగులు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ ఢిల్లీ రావుకు వినతిపత్రం అందజేశారు. మూడేళ్లుగా పింఛన్లు సక్రమంగా రాలేదని ఆరోపించారు. 60 ఏళ్లు ప్రజలకు సేవలందించిన తమకు ప్రభుత్వం ఇచ్చిన బహుమతి ఇదేనా? అని ప్రశ్నించారు.
ప్రతి నెలా పింఛన్లకోసం ఎదురు చూడాల్సిన దుస్థితి రావడంతో.. నెలవారీ చెల్లింపులు, అప్పులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, బాపట్ల జిల్లా విశ్రాంత ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిపై కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఔషధాలు కొనుగోలు చేయలేక అనారోగ్య సమస్యలతో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు సైతం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కుటుంబ పోషణకు, వైద్య ఖర్చులకు పింఛనే ఆధారమని ఒంగోలు విశ్రాంత ఉద్యోగులు వేడుకుంటున్నారు. కన్నవారు పట్టించుకోక, పింఛను సకాలంలో అందక.. నానా యాతన పడుతున్నామన్నారు.
ఒకటో తేదీనే పింఛన్లు ఇవ్వాలంటూ విజయనగరం జిల్లా బొబ్బిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద విశ్రాంత ఉద్యోగులు ధర్నా చేశారు. సంక్షేమం పేరిట బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం.. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వయస్సు మీరి అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న తమకు సకాలంలో పింఛన్లు అందించాలని విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!