ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌, కేరళ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో పరీక్షల నిర్వహణపై అఫిడవిట్‌ వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత

Updated : 22 Jun 2021 19:12 IST

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌, కేరళ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో పరీక్షల నిర్వహణపై అఫిడవిట్‌ వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. రెండ్రోజుల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇన్ని రోజులైనా అఫిడవిట్‌ ఎందుకు వేయలేదని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఏపీ నుంచి స్పష్టత లేదని అసహనం వ్యక్తం చేసింది.  ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణపై అన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నా ఏపీ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించిన న్యాయస్థానం.. ఏపీని ఎందుకు మినహాయించాలో చెప్పాలని నిలదీసింది. 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తారా?లేదా స్పష్టంగా చెప్పాలని ఏపీని ఆదేశించింది. 11వ తరగతి పరీక్షలు సెప్టెంబరులో నిర్వహిస్తామని కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.

పరీక్షలను రద్దు చేయని ఆంధ్రప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు గురువారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. రద్దు చేసిన సీబీఎస్‌ఈ పరీక్షల మార్కుల కేటాయింపు విధానానికి ఆమోదం తెలిపే సందర్భంలో సుప్రీంకోర్టులో ఈ విషయం చర్చకు వచ్చింది. 28 రాష్ట్రాలకుగానూ 18 రాష్ట్ర బోర్డులు ఇప్పటికే 12వ తరగతి పరీక్షలను రద్దు చేశాయని, మిగిలిన ఆరు.. కరోనా రెండో ఉద్ధృతి రాకముందే పరీక్షలు నిర్వహించాయని పిటిషనరు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మిగిలిన నాలుగు రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేయలేదని పేర్కొన్నారు. రద్దైన సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకన విధానానికి సుప్రీం ఆమోదం తెలిపింది. 13 మంది నిపుణుల కమిటీ తయారుచేసిన  ‘మూల్యాంకన కమిటీ నివేదిక’ను సర్వోన్నత న్యాయస్థానానికి సీబీఎస్‌ఈ గురువారమే సమర్పించింది. సీఐఎస్‌సీఈ తన మదింపు విధానాన్ని తెలిపింది. ఫలితాలను జులై 31లోగా ప్రకటిస్తామంది. వివిధ బోర్డులు  సమర్పించిన ప్రతిపాదనలను న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ఆమోదించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని