Amaravati: ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టేకు సుప్రీం నిరాకరణ

రాజధాని అమరావతి అంశంలో ఏపీ హైకోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 

Updated : 28 Nov 2022 15:51 IST

దిల్లీ: రాజధాని అమరావతి అంశంలో ఏపీ హైకోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నెలరోజుల్లో కొన్ని పనులు, ఆరు నెలల్లో మరికొన్ని పనులు చేయాలన్న పరిమితులపై మాత్రమే స్టే విధించింది. అనంతరం ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 31న చేపట్టనున్నట్లు తెలిపింది. ఆలోపు జవాబు తప్పనిసరిగా దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాజీ అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌, శ్రీరామ్, నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాజధాని ప్రాంత రైతుల తరఫున సీనియర్‌ న్యాయవాది శ్యాందివాన్‌ వాదించారు. హైకోర్టు ఆదేశించిన ఏడు అంశాలపై స్టే విధించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరగా.. దానికి సుప్రీంకోర్టు నిరాకరిస్తూ కాలపరిమితికి సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులపై మాత్రమే స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వం, రైతుల తరఫున సుమారు గంటన్నరపాటు వాదనలు కొనసాగాయి. వాదనల తర్వాత హైకోర్టు మాండమస్‌ కొనసాగిస్తూ సుప్రీం ధర్మాసనం ఏడు సూచనలు చేసింది. ఈ ఏడు సూచనలతో మాండమస్‌ కొనసాగుతుందని తీర్పు వెల్లడించింది.

* రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ షెడ్యూల్‌ 2, 3, ల్యాండ్‌ పూలింగ్‌ రూల్స్‌ నిర్వర్తించాలి.

* 2015 కింద పొందుపర్చిన వారి విధులను నిర్వహించాలి.

* ల్యాండ్ పూలింగ్‌ భూమిని మూడో పక్షానికి కేటాయించడం నిషేధం.

* ల్యాండ్ పూలింగ్‌ భూమిని తనఖా పెట్టడం నిషేధం.

* భూమి అన్యాక్రాంతానికి అవకాశం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ చర్యలు తీసుకోవద్దు.

* రాజధాని ప్రాంత అభివృద్ధి, నిర్మాణానికి మాత్రమే భూమి కేటాయింపు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని