Supreme Court: ఎమ్మెల్యేలకు ఎర కేసు..‘స్టేటస్‌-కో’కు సుప్రీంకోర్టు నిరాకరణ

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై స్టేటస్‌కో ఇచ్చేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) నిరాకరించింది. హైకోర్టు తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం (TS Govt) సుప్రీంను ఆశ్రయించిన నేపథ్యంలో ఆ పిటిషన్‌పై ఈనెల 17న విచారణ చేపడతామని తెలిపింది.

Updated : 08 Feb 2023 12:25 IST

పిటిషన్‌ను 17న విచారిస్తామన్న సర్వోన్నత న్యాయస్థానం

దిల్లీ: భారాస ఎమ్మెల్యేలకు ఎర కేసు(MLAs Poaching Case)లో తెలంగాణ హైకోర్టు (TS High Court) ఇచ్చిన ఉత్తర్వులపై ఈ నెల 17న సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసు గురించి సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం వద్ద రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ప్రత్యేకంగా ప్రస్తావించారు. హైకోర్టు ఉత్తర్వులపై ‘స్టే’ విధించాలని.. లేదా ‘స్టేటస్‌ కో’ (యథాతథ స్థితి) ఇవ్వాలని ఆయన కోరారు. ఫైల్‌ ఒకసారి సీబీఐ చేతికి వెళ్తే పిటిషన్‌ నీరుగారిపోతుందని సీజేఐకు తెలిపారు. ఫైల్స్‌ ఇవ్వాలని ఇప్పటికే సీబీఐ నుంచి ఒత్తిడి ఉందన్నారు. ఈ నేపథ్యంలో స్టేటస్‌ కో ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. 

దీనిపై సీజేఐ స్పందిస్తూ స్టే, స్టేటస్‌ కో ఇచ్చేందుకు నిరాకరించారు. కేసుపై ఈనెల 17న విచారణ చేపడతామని.. ఆరోజే అన్ని అంశాలనూ పరిశీలిస్తామని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. కేసులో మెరిట్స్‌ ఉంటే ఇచ్చిన డాక్యుమెంట్లను వెనక్కి ఇవ్వాలని సీబీఐను ఆదేశిస్తామని తెలిపింది. కేసు తీవ్రత దృష్ట్యా 17వ తేదీ కంటే ముందే విచారణ చేపట్టాలని.. దానికి ఉన్న అవకాశాలను పరిశీలించాని న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. 17నే విచారణ చేపడతామని సీజేఐ ధర్మాసనం మరోసారి స్పష్టం చేసింది.

మరోవైపు హైకోర్టులోనూ దీనిపై విచారణ జరిగింది. తీర్పు ఆపాలన్న రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నిరాకరించారు. కేసు దస్త్రాల కోసం సీబీఐ ఒత్తిడి చేస్తోందని.. సింగిల్‌ జడ్జి వద్ద విచారణకు అనుమతి ఇవ్వాలని అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ కోరారు. కేసు ఫైల్స్‌ ఇవ్వాలని సీఎస్‌కు మంగళవారం సీబీఐ మరోసారి లేఖ రాసిందని చెప్పారు. డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చాక మళ్లీ సింగిల్‌ జడ్జి విచారణ జరపకూడదని.. సుప్రీంకోర్టు మాత్రమే దీనిపై సమీక్ష చేస్తుందని సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు