Taraka Ratna: మరిన్ని పరీక్షల తర్వాత తారకరత్న ఆరోగ్యంపై స్పష్టత

నటుడు తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. మధ్యాహ్నం తర్వాత వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయనున్నారు.

Updated : 30 Jan 2023 11:32 IST

మధ్యాహ్నం తర్వాత హెల్త్‌ బులెటిన్‌..

బెంగళూరు: నటుడు తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని.. మరిన్ని పరీక్షలు చేసిన తర్వాత స్పష్టత వస్తుందని వైద్యులు తెలిపారు. ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్‌ చేసిన అనంతరం తారకరత్న ఆరోగ్యంపై పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడయ్యే అవకాశముంది. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై సోమవారం మధ్యాహ్నం తర్వాత ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయనున్నారు. మరోవైపు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వద్ద అభిమానులు, సందర్శకుల తాకిడి పెరుగుతుండటంతో అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని స్థానిక పోలీసు అధికారులను బెంగళూరు సిటీ పోలీస్‌ కమిషనర్ ప్రతాప్‌రెడ్డి ఆదేశించారు.

తారకరత్నకు కుప్పంలో యాంజియోప్లాస్టీ తర్వాత నారాయణ హృదయాలయలో వైద్యుల బృందం ఆయనకు చికిత్స కొనసాగిస్తోంది. కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కె.సుధాకర్‌ ఆదివారం తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఆయన గుండె స్పందన సాధారణంగా ఉన్నా మెదడు పనితీరు సాధారణ స్థితిలో లేదని ఆయన పేర్కొన్నారు. గుండెపోటు వచ్చిన తర్వాత 30 నిమిషాలపాటు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో మెదడు పనితీరుపై ప్రభావం పడినట్లు పరీక్షల ద్వారా గుర్తించామని తెలిపారు. నిమ్హాన్స్‌ న్యూరోసర్జన్‌ ప్రొఫెసర్‌ గిరీష్‌ కులకర్ణి నేతృత్వంలో ఇద్దరు న్యూరో సర్జన్లు తారకరత్న ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం నారాయణ హృదయాలయ, నిమ్హాన్స్‌ల నుంచి 10 మంది వైద్యులు ఆయన పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని