
CM KCR: తెలంగాణలో డ్రగ్స్ అనే మాట వినిపించకూడదు: కేసీఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినిపించకుండా కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలన్నారు. డ్రగ్స్ కేసులో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. దోషులు ఎంతటివారైనా సరే కఠినంగా వ్యవహరించాలన్నారు. దీని అమలు కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. నార్కోటిక్, ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్, వెయ్యి మందితో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. డ్రగ్స్ వ్యవస్థీకృత నేరాలను కఠినంగా నియంత్రించాలన్నారు.
దీనిలో భాగంగా ఎల్లుండి స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్ జరపాలని సీఎం నిర్ణయించారు. డ్రగ్స్ నియంత్రణ చర్యలపై హోంమంత్రి, ఎక్సైజ్శాఖ మంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఎస్పీలు, సీపీలతో శుక్రవారం కేసీఆర్ సమీక్షించనున్నారు. సమీక్షకు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు హాజరవనున్నారు. డ్రగ్స్ నివారణకు చేపట్టాల్సిన కార్యాచరణ, వాటి నివారణ విధివిధానాలపై చర్చించనున్నారు.