TS Govt: ఆ తీర్పు అమలును రెండు వారాలు నిలిపివేయండి: హైకోర్టును కోరిన తెలంగాణ ప్రభుత్వం

ఎమ్మెల్యేలకు ఎర కేసులో తీర్పు అమలును నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వీలుగా తీర్పును ఆపాలని విజ్ఞప్తి చేసింది. 

Updated : 07 Feb 2023 13:36 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించడంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో విచారణను సీబీఐకు అప్పగిస్తూ ఇచ్చిన తీర్పును రెండు వారాలు నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. గత తీర్పులపై రెండు వారాలు సస్పెన్షన్‌ ఇవ్వాలని సింగిల్‌ జడ్జిని అడ్వొకేట్‌ జనరల్‌ కోరారు. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వీలుగా తీర్పును ఆపాలని.. దీనిపై అత్యవసర విచారణ జరపాలని జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి బెంచ్‌ను ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. మధ్యాహ్నం 2:30గంటలకు లంచ్ మోషన్‌ విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. 

ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో మొయినాబాద్‌ ఫాం హౌస్‌ కేసు సీబీఐకి అప్పగించాలని కోరుతూ నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజీలతో పాటు న్యాయవాది భూసారపు శ్రీనివాస్‌, కేరళకు చెందిన తుషార్‌ వెల్లపల్లిలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్‌లపై విచారించిన సింగిల్‌ జడ్జి... కేసు దర్యాప్తును సిట్‌ నుంచి సీబీఐకి అప్పగిస్తూ డిసెంబరు 26న తీర్పు వెలువరించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి దాఖలు చేసిన అప్పీళ్లు విచారణార్హం కావని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం సోమవారం కొట్టివేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని