TS HighCourt: తొలగిన ప్రతిష్టంభన... గవర్నర్‌ ప్రసంగంతోనే బడ్జెట్‌ సమావేశాలు

రాష్ట్ర బడ్జెట్‌ ఆమోదం విషయంలో హైకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం.. పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. ఉన్నత న్యాయస్థానం సూచన మేరకు ఇరు పక్షాల న్యాయవాదులు చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

Updated : 24 Mar 2023 15:29 IST

హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌ ఆమోదం విషయంలో తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య ఏర్పడిన సందిగ్ధతకు తెరపడింది. బడ్జెట్‌ను గవర్నర్‌ ఇప్పటి వరకు ఆమోదించలేదంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. హైకోర్టు సూచన మేరకు ఇటు ప్రభుత్వ, అటు రాజ్‌భవన్‌ తరఫు న్యాయవాదులు చర్చలు జరిపి ఓ పరిష్కారానికి వచ్చారు. అసెంబ్లీ సమావేశాల రాజ్యాంగబద్ధ నిర్వహణకు నిర్ణయించుకున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి కూడా అంగీకరించినట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవే కోర్టుకు తెలిపారు. అలాగే, అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు గవర్నర్‌ అనుమతించనున్నట్లు రాజ్‌భవన్‌ న్యాయవాది అశోక్‌ ఆనంద్‌ కోర్టుకు తెలిపారు. ఇరువైపుల న్యాయవాదుల సమ్మతితో హైకోర్టు విచారణ ముగించింది.

2023-24 బడ్జెట్‌ను అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా.. దానికి గవర్నర్‌ తమిళిసై ఇంకా ఆమోదం తెలపకపోవడంతో అధికార వర్గాల్లో ఉత్కంఠ ఏర్పడింది. మరో నాలుగు రోజులే సమయం ఉండటంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. గవర్నర్‌ సమ్మతి తర్వాతే బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదిస్తుంది. అనంతరం శాసనసభ, మండలిలో ప్రవేశపెడతారు. ముసాయిదా బడ్జెట్‌ ప్రతులను మూడురోజుల క్రితమే ప్రభుత్వం గవర్నర్‌ కార్యాలయానికి పంపించింది. ఇప్పటివరకు గవర్నర్‌  ఆమోదం తెలపక పోవడంతో సందిగ్ధత ఏర్పడింది. దీంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.

కేసీఆర్‌ సమాలోచనలు

గవర్నర్‌ ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో పార్టీ నేతలు, అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాలోచనలు చేస్తున్నారు. మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డితోపాటు కొందరు ఉన్నతాధికారులు ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు. గవర్నర్‌ ప్రసంగం నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాల తేదీలపై చర్చిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని