TS News: మూడో ద‌శ ఎదుర్కొనేందుకు సిద్ధం: డీహెచ్‌

తెలంగాణ రాష్ట్రంలోని క‌రోనా ప‌రిస్థితుల‌పై ప్ర‌జారోగ్య సంచాల‌కుడు(డీహెచ్‌) శ్రీ‌నివాస‌రావు, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి రిజ్వి, డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి, పౌర స‌ర‌ఫ‌రాల క‌మిష‌న‌ర్‌ హైకోర్టుకు నివేదిక స‌మ‌ర్పించారు. గ‌త నెల‌

Updated : 09 Jun 2021 16:34 IST

హైకోర్టుకు నివేదిక స‌మ‌ర్పించిన డీహెచ్‌, డీజీపీ, వైద్యారోగ్య‌శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని క‌రోనా ప‌రిస్థితుల‌పై ప్ర‌జారోగ్య సంచాల‌కులు(డీహెచ్‌) శ్రీ‌నివాస‌రావు, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి రిజ్వి, డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి, పౌర స‌ర‌ఫ‌రాల క‌మిష‌న‌ర్‌ హైకోర్టుకు నివేదిక స‌మ‌ర్పించారు. గ‌త నెల‌ 29వ తేదీ నుంచి రోజుకు స‌రాస‌రి ల‌క్ష క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తున్న‌ట్లు డీహెచ్‌ వివ‌రించారు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 66,79,098 వ్యాక్సిన్లు వేసిన‌ట్లు తెలిపారు. ఆస్ప‌త్రుల్లో ఇన్ పేషెంట్లు త‌గ్గుతున్నార‌ని.. ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో 36.50 శాతం, ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో 16.35 శాతం ప‌డ‌క‌లు నిండిన‌ట్లు ఆయ‌న‌ తెలిపారు. క‌రోనా మూడో ద‌శ వ‌స్తే ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్న‌ట్లు హైకోర్టుకు స‌మ‌ర్పించిన నివేదిక‌లో డీహెచ్‌ పేర్కొన్నారు. ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో 10,366 బెడ్ల‌ను ఆక్సిజ‌న్ ప‌డక‌లుగా మార్చిన‌ట్లు చెప్పారు. మ‌రో 15వేల ప‌డ‌క‌ల‌కు కూడా ఆక్సిజ‌న్ ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

రాష్ట్రంలోని ఆస్ప‌త్రుల్లో 132 ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి కేంద్రాల ఏర్పాటుకు అనుమ‌తి ఇచ్చిన‌ట్లు డీహెచ్ శ్రీ‌నివాస‌రావు తెలిపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా పిల్ల‌ల కోసం నాలుగు వేల ప‌డ‌క‌ల ఏర్పాట్ల‌తో పాటు నిలోఫ‌ర్ ఆస్ప‌త్రిలో మ‌రో వెయ్యి ప‌డ‌క‌లు సిద్ధం చేస్తున్న‌ట్లు ఆయ‌న నివేదిక‌లో పేర్కొన్నారు. వైద్య సిబ్బంది పెంపున‌కు, శిక్ష‌ణ‌కు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేస్తున్నామ‌న్నారు.

ధ‌ర‌ల ఖ‌రారుకు గ‌డువు కావాలి:  రిజ్వి

ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో క‌రోనా, బ్లాక్ ఫంగ‌స్ చికిత్స‌ల‌కు గరిష్ఠ ధ‌ర‌ల ఖరారు చేయ‌మ‌ని ఇటీవ‌ల హైకోర్టు ఆదేశించిన నేప‌థ్యంలో వైద్యారోగ్య‌శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి రిజ్వి.. ధ‌ర‌ల ఖ‌రారుకు సంబంధించి గ‌డువు కావాల‌ని ఉన్న‌త న్యాయ‌స్థానాన్ని కోరారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ వివరణపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా తగ్గిపోయాక గరిష్ఠ ధరలు ఖరారు చేస్తారా అని ప్రశ్నించింది. ఇప్పటికి నాలుగు వారాల గడువు ఇచ్చాం.. ఇంకా నాలుగు వారాల గడువు  ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది. కనీసం రెండు వారాల సమయం ఇవ్వాలని రిజ్వీ అభ్యర్థించగా.. చివరి అవకాశంగా రెండు వారాల సమయం ఇస్తున్నట్టు హైకోర్టు తెలిసింది. రెండు వారాల్లో జీవో జారీ చేసి సమర్పించాలని ఆదేశించింది.

నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌లు చేస్తున్నాం:  డీజీపీ

క‌రోనా నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌లు చేస్తున్నామ‌ని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి తెలిపారు. నిబంధ‌న‌లు పాటించ‌ని వారిపై ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 7 వ‌ర‌కు 8.79 ల‌క్ష‌ల కేసులు న‌మోదు చేసిన‌ట్లు ధ‌ర్మాస‌నానికి వివ‌రించారు. క‌రోనా ఔష‌ధాల‌కు సంబంధించిన బ్లాక్ మార్కెట్‌పై 160 కేసులు, మాస్కులు ధ‌రించ‌ని వారిపై 4.56 ల‌క్ష‌ల కేసులు నమోదు చేశామన్నారు. దీనికి సంబంధించి రూ.37.94 కోట్ల జ‌రిమానా, భౌతిక దూరం పాటించ‌నందుకు 48,643 కేసులు, లాక్‌డౌన్, క‌ర్ఫ్యూ ఉల్లంఘ‌న‌ల‌పై 3.43 కేసులు న‌మోదు చేసిన‌ట్లు డీజీపీ కోర్టుకు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని