Heavy Rains: చెయ్యేరు నదికి పోటెత్తిన వరద: 30 మంది గల్లంతు.. ముగ్గురి మృతి

భారీ వర్షాలు, వరదల కారణంగా కడప జిల్లాలోని రాజంపేట సమీపంలో అన్నమయ్య జలాశయం మట్టికట్ట కొట్టుకుపోయింది.

Updated : 19 Nov 2021 17:26 IST

రాజంపేట: భారీ వర్షాలు, వరదల కారణంగా కడప జిల్లాలోని రాజంపేట సమీపంలో అన్నమయ్య జలాశయం మట్టికట్ట కొట్టుకుపోయింది. దీంతో పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. గుండ్లూరు, పులపత్తూరు, శేషమాంబపురం, మందపల్లి గ్రామాలు నీటమునిగాయి. చెయ్యేరు నది నుంచి పెద్ద ఎత్తున నందలూరు, రాజంపేట తదితర ప్రాంతాల్లోకి వరద పోటెత్తుతోంది. చెయ్యేరు నది పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నందలూరు పరివాహక ప్రాంతంలోని మందపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతంలో సుమారు 30 మంది చెయ్యేరు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

గల్లంతైన వారి సంఖ్య మరింత ఎక్కువ: స్థానికులు

వరద ముంపుతో ఆయా గ్రామాల్లో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 30మంది వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయినట్లు అధికారులు చెబుతున్నా.. స్థానికులు మాత్రం ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. భారీగా ప్రాణ నష్టం వాటిల్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు తెలిపారు. రాజంపేట, నందలూరు మధ్య అస్తవరానికి సమీపంలో రైల్వే ట్రాక్‌ కిలోమీటరు మేర కొట్టుకుపోయింది. మరోవైపు నందలూరు వద్ద మూడు మృతదేహాలను వెలికితీశారు. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని