Ap News: ప్రైవేటు వ్యక్తులు నడపలేక పోతున్నారనే ప్రభుత్వం తీసుకుంటోంది: ఆదిమూలపు సురేశ్‌

ప్రభుత్వ గ్రాంటుతో ప్రైవేటు యాజమాన్యాలు కాలేజీలు, పాఠశాలలు నడుపుతున్పప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఎక్కడైనా నాణ్యమైన విద్య అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని.. ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదని అభిప్రాయపడ్డారు...

Updated : 28 Sep 2021 12:19 IST

అమరావతి: ప్రభుత్వ గ్రాంటుతో ప్రైవేటు యాజమాన్యాలు కాలేజీలు, పాఠశాలలు నడుపుతున్పప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఎక్కడైనా నాణ్యమైన విద్య అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని.. ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదని అభిప్రాయపడ్డారు. ఏపీలో ప్రభుత్వ గ్రాంటుతో నడుస్తున్న పాఠశాలలు, కళాశాలలు 2,200కు పైగా ఉన్నాయన్నారు. సంస్కరణలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్నారు. జీవో నంబర్ 52 ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల మేరకు గ్రాంట్‌ పొందుతున్న ప్రైవేటు సంస్థల ఆస్తులు ప్రభుత్వమే తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

‘‘కమిటీ సిఫార్సుల మేరకు యాజమాన్యాలు గ్రాంట్‌ను వదులుకోవడం, మొత్తంగా ప్రభుత్వానికి అప్పగించడం లేదా పూర్తిగా ప్రైవేటుగా నడిపించేలా యాజమాన్యాలకు మూడు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాం. 137 డిగ్రీ కళాశాలల్లో 125 ప్రభుత్వానికి అప్పగించారు. ఆ మేరకు ప్రభుత్వానికి అంగీకార పత్రాన్ని అందజేశారు. 103 జూనియర్ కళాశాలలు కూడా అధ్యాపకులతో సహా ప్రభుత్వానికి అంగీకారం తెలిపారు. పాఠశాలలు 2 వేలకు పైగా ఉన్నాయి.  1,276 పాఠశాలలు పూర్తిగా ప్రభుత్వానికి అప్పగించారు. ఆన్ ఎయిడెడ్ పాఠశాలలు ఏవీ మూతపడవు. ఒక వేళ ప్రైవేటు వ్యక్తులు మూసివేయదల్చుకుంటే ప్రభుత్వం వాటిని నడుపుతుంది.

గ్రాంట్ ఇన్ ఎయిడ్ కళాశాలల అధ్యాపకుల బదిలీలు కూడా జరుగుతాయి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థల నుంచి అధ్యాపకులు వచ్చినా కాంట్రాక్టు లెక్చరర్లకు ఇబ్బందులు కలుగనీయం. యూనివర్సిటీ పరిధిలో వారికి వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేస్తాం. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వందల కోట్ల రూపాయల నిధులు వృథా అయ్యాయి.  గతంలో ప్రైవేటు కళాశాలలు, యూనివర్సిటీలు తీసుకువచ్చి విద్యా వ్యవస్థను నీరుగార్చారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కూళ్లు, కళాశాలలు ఎక్కడా మూతపడవని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు హామీ ఇస్తున్నాం. రాజకీయ దురుద్దేశాలతో, ఆస్తులు దక్కించుకోవాలనే దురుద్దేశాలతో ఈ సంస్కరణలు తీసుకురాలేదు. 
శాస్త్రీయంగా కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలకు ఏడాదికి రూ. 600 కోట్లు అవుతోంది. పాఠశాలలకు, కళాశాలలకు కలిపి ఏటా రూ.1200 కోట్లు ఖర్చు  చేస్తున్నాం. ప్రైవేటు వ్యక్తులు నడపలేక పోతున్నారనే ప్రభుత్వం తీసుకుంటోంది’’ అని సురేశ్‌ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని