Amaravati Padayatra: వర్షంలోనూ అమరావతి రైతుల ‘మహాపాదయాత్ర’

ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న అమరావతి మహా పాదయాత్ర వర్షంలోనూ కొనసాగుతోంది.

Updated : 11 Nov 2021 13:18 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న అమరావతి మహా పాదయాత్ర వర్షంలోనూ కొనసాగుతోంది. పదకొండో రోజైన ఇవాళ ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో యాత్రను ప్రారంభించారు. ఆ ప్రాంతంలో వర్షం పడుతుండటంతో గొడుగులు, రెయిన్‌కోట్లు ధరించి రైతులు ముందుకు కదులుతున్నారు. కాగా నాగులుప్పల పాడు మార్గాలను పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి దిగ్బంధించారు. తమకు సంఘీభావం తెలపడానికి వస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

పోలీసులు ఆంక్షల నడుమ న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన యాత్ర ముందుకు సాగుతోంది. అంతకముందు.. రాత్రి పూట రైతులు బస చేసిన నాగులుప్పలపాడులో అకాల వర్షం కారణంగా గుడారాలు తడిచిపోయి వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర 45 రోజుల పాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే ఈ యాత్ర డిసెంబరు 15న తిరుపతిలో ముగియనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని