కృష్ణాజలాల పంపకాలు 70:30 నిష్పత్తిలో జరగాలి.. కేఆర్‌ఎంబీకీ ఏపీ ప్రభుత్వం లేఖ

కృష్ణా జలాల పంపకాలపై ఏపీ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కు లేఖ రాసింది. 2021-22 సంవత్సరానికి గానూ 70:30 నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలని ..

Updated : 25 Aug 2021 15:59 IST

అమరావతి: కృష్ణా జలవివాదాల రెండో ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం 2021-22 నీటి సంవత్సరానికి 70:30 నిష్పత్తిలోనే నీటి పంపకాలు జరగాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. 50:50 శాతం నిష్పత్తిలో నీటి పంపకాలకు సంబంధించి కేఆర్ఎంబీ లేఖపై స్పందిస్తూ ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్‌సీ) నారాయణ రెడ్డి ప్రత్యుత్తరం పంపారు. ట్రైబ్యునల్ అవార్డు వచ్చేంత వరకూ తాత్కాలికంగా కృష్ణా జలాల్లో 50:50 నిష్పత్తిలోనే నీటి పంపకాలు చేయాలంటూ తెలంగాణ చేసిన డిమాండ్‌పై కేఆర్ఎంబీ ఏపీ అభిప్రాయాన్ని కోరింది. దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్.. నీటి పంపకాల్లో ఆ వాటా సహేతుకం కాదని తేల్చి చెప్పింది.

ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి పంపకాలను ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయలేదని ఏపీ ఆ లేఖలో స్పష్టం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి చెన్నైకి, హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరా విషయంలో మాత్రమే కొన్ని నిబంధనలు విధించినట్లు వెల్లడించింది. అలాగే నాగార్జున సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి అవసరాల కోసం ప్రకాశం బ్యారేజీకి నీటి సరఫరా విషయంలో మాత్రమే ఉమ్మడి ఏపీలో ప్రాజెక్టుల వారీగా కొన్ని నిర్ణయాలు చేసినట్టు స్పష్టం చేసింది. ఏపీ పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాల కోసం 1,059 టీఎంసీలు కావాలని ట్రైబ్యునల్‌కు విజ్ఞప్తి చేసినట్టు వెల్లడిచింది.

షెకావత్‌కు ప్రకాశం జిల్లా తెదేపా నేతల లేఖ..

ఆంధ్రప్రదేశ్‌లోని వెలిగొండ ప్రాజెక్టును గెజిట్‌లో చేర్చాలని ప్రకాశం జిల్లా తెదేపా నేతలు కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షేకావత్‌ను కోరారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా తెదేపా నేతలు కేంద్ర మంత్రికి లేఖ రాశారు. తాగునీటి కోసం ప్రకాశం జిల్లా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతులు లేవని గెజిట్‌లో పేర్కొన్నారని.. విభజన చట్టానికి పూర్తి విరుద్ధం అని వెల్లడించారు. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదవుతున్న 50 జిల్లాల్లో ప్రకాశం జిల్లా ఒకటని.. అలాంటి ప్రకాశం జిల్లాలకు అన్యాయం చేయొద్దని వేడుకుంటున్నట్లు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలను తెలిపేందుకు సమయం ఇవ్వాలని తెదేపా నేతలు షెకావత్‌ను కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని