వచ్చే నెలలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌

జాబ్‌ కేలండర్‌లో ఇప్పటికే ప్రకటించిన పోస్టుల సంఖ్య పెంచుతున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్‌-1, గ్రూప్‌-2 సహా పలు విభాగాల్లో అదనంగా పోస్టులు జత చేసి

Updated : 16 Jul 2021 17:48 IST

అమరావతి: జాబ్‌ క్యాలెండర్‌లో ఇప్పటికే ప్రకటించిన పోస్టుల సంఖ్య పెంచుతున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్‌-1, గ్రూప్‌-2 సహా పలు విభాగాల్లో అదనంగా పోస్టులు జత చేసి వచ్చే నెలలో నోటిఫికేషన్‌ ఇస్తామని ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్‌ సలాంబాబు తెలిపారు. ఇప్పటి వరకు 1180 ఖాళీ పోస్టులను గుర్తించామని, వీటిలో గ్రూప్‌ 1, 2 సహా పలు విభాగాల్లో పోస్టులు ఉన్నట్టు తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టులు వివరాలు  రావాల్సి ఉందని, ఇవన్నీ వచ్చాక ఎన్ని పోస్టులు వస్తే అన్ని పెంచి ఆగస్టులో గ్రూప్సు సహా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. 

అభ్యర్థుల వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కోరుతున్నారని, ఇప్పటి వరకు వచ్చిన వినతులను పరిశీలించాలని ప్రభుత్వానికి నోట్‌ పంపినట్టు తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వయో పరిమితి పెంపుపై నిర్ణయం తీసకుంటామని వెల్లడించారు. గ్రూప్‌-1 మినహాయించి మిగిలిన ఏ నోటిఫికేషన్‌కూ ఇకపై ప్రిలిమ్స్‌ ఉండదని స్పష్టం చేశారు. ఇకపై ఏపీపీఎస్సీ నియామకాలకు ఒకే పరీక్ష నిర్వహించి, ఇకపై 3-4 నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. త్వరగా పోస్టులు భర్తీ చేసేందుకే ప్రిలిమ్స్‌ రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇకపై వచ్చే నోటిఫికేషన్లకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఉద్యోగాల సాధన కోసం విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నించిన నిరుద్యోగులపై కేసులు ఎత్తివేయాలని నిర్ణయించి ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిపారు. నిరుద్యోగుల భవిష్యత్తుకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకే కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకుంటున్నట్టు సలాంబాబు వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని