Ap News: దశల వారీగా ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరిస్తాం: బుగ్గన

ఏపీ ఉద్యోగ సంఘాల నేతలతో పెండింగ్ అంశాలపై చర్చలు జరిపినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఇరు జేఏసీల నేతలతో మాట్లాడినట్లు తెలిపారు. చాలా రోజులుగా వారు ఇచ్చిన విజ్ఞప్తులను తీసుకున్నామని.. కొవిడ్ సహా వివిధ అంశాల వల్ల ఈ అంశాల పరిష్కారం ఆలస్యం అయిందన్నారు. ప్రభుత్వం అనేది ఓ కుటుంబం, ఉద్యోగులు కూడా...

Published : 17 Dec 2021 01:37 IST

అమరావతి: ఏపీ ఉద్యోగ సంఘాల నేతలతో పెండింగ్ అంశాలపై చర్చలు జరిపినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఇరు జేఏసీల నేతలతో మాట్లాడినట్లు తెలిపారు. చాలా రోజులుగా వారు ఇచ్చిన విజ్ఞప్తులను తీసుకున్నామని.. కొవిడ్ సహా వివిధ అంశాల వల్ల ఈ అంశాల పరిష్కారం ఆలస్యం అయిందన్నారు. ప్రభుత్వం అనేది ఓ కుటుంబం, ఉద్యోగులు కూడా అందులో భాగమని పేర్కొన్నారు. ఉద్యోగులకు సంబంధించిన అంశాలు త్వరలోనే పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు. దశల వారీగా వారిచ్చిన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోందని వెల్లడించారు. వారి డిమాండ్లకు సానుకూలంగా స్పందించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. బుధవారం సీఎస్ సమీర్‌శర్మతో కూడిన కార్యదర్శుల కమిటీ ఉద్యోగుల సమస్యలపై నిర్ణయం తీసుకుంటుందని.. తానే స్వయంగా పర్యవేక్షిస్తాని బుగ్గన తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లపై 9 సంఘాలు ఉద్యమం చేస్తున్నాయని, వారిని విరమించాలని ప్రభుత్వం తరఫున కోరుతున్నట్లు తెలిపారు. డిమాండ్లను పరిష్కరిస్తామని వారికి హామీ ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నేతలతో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వేర్వేరుగా చర్చలు జరిపింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. పీఆర్‌సీ సహా ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించిన 71 అంశాలపై భేటీలో ప్రధానంగా చర్చించారు.

డిమాండ్లను మరోమారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం: వెంకట్రామిరెడ్డి

‘‘ఉద్యోగుల డిమాండ్లను మరోమారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఏపీ సచివాలయానికి సంబంధించి 11 అంశాలు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 85 అంశాలు నివేదించాం. సచివాలయంలో అదనపు పోస్టులను భర్తీ చేయాలని కోరాం. కోర్టు కేసులు ఎక్కువ అవుతున్నందున అదనపు పని భారం పెరిగింది. అసెంబ్లీ ఉద్యోగులకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. జిల్లాల్లో ఉద్యోగులకు స్థానికంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరాం. వీఆర్వోలకు పదోన్నతులు ఇచ్చినా గ్రేడ్-2 స్కెల్‌నే అమలు చేస్తున్నారనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం’’ అని తెలిపారు.

దురుద్దేశంతో ఉద్యమ కార్యాచరణకు వెళ్లలేదు: బొప్పరాజు

‘‘మా సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా  స్పందించింది. 71 అంశాలపై కూలంకషంగా చర్చించాం. ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇస్తామని చెప్పింది. ప్రభుత్వ హామీతో ఉద్యమ కార్యాచరణ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. దురుద్దేశంతో ఉద్యమ కార్యాచరణకు వెళ్లలేదు. ఇవాళ్టి భేటీ మినిట్స్‌ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నెల 7 నుంచి ఉద్యోగులంతా ఆందోళనతో ఉన్నారు. ఉద్యమ కార్యాచరణను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాం’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని