
Chandrababu Naidu: ఏపీలో పోలీస్ ప్రతిష్ఠ రోజురోజుకూ దిగజారుతోంది: చంద్రబాబు
లింగసముద్రం ఘటనపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ
అమరావతి: వైకాపా నేతల ఆదేశాలతో ప్రకాశం జిల్లా లింగసముద్రం పోలీసులు మొగిలిచర్లకు చెందిన ఆరుగురు తెదేపా కార్యకర్తలను స్టేషన్కు పిలిపించి వేధిస్తున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్కు ఆయన లేఖ రాశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఆరు నుంచి 10 ఏళ్ల చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. పి.రత్తయ్య, ఎం.శ్రీకాంత్ అనే కార్యకర్తలను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారన్న చంద్రబాబు.. తెదేపాను వీడాలని వారిపై ఒత్తిడి చేశారన్నారు. అర్ధరాత్రి 2 గంటలకు వదలిపెట్టారని మండిపడ్డారు. ఉదయాన్నే మళ్లీ 6.30 గంటలకు లింగసముద్రం ఎస్ఐ ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కు రావాలని బెదిరించారని ఆక్షేపించారు.
పోలీసుల బెదిరింపులు తట్టుకోలేక రత్తయ్య, శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని లేఖలో చంద్రబాబు తెలిపారు. ఈ ఘటన తర్వాత మిగిలిన వారిని హడావుడిగా స్టేషన్ నుంచి పంపించారని, ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదని లేఖలో పేర్కొన్నారు. ఈ సంఘటనతో రాష్ట్రంలో పోలీసుల వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోందన్నారు. రెండేళ్లలో పోలీసుల బెదిరింపులు తారస్థాయికి చేరుకున్నాయన్న చంద్రబాబు.. పోలీస్ ప్రతిష్ఠ రోజురోజుకూ దిగజారుతోందన్నారు. చట్టానికి లోబడి పోలీసులు విధులు నిర్వహించాలని హితవు పలికారు. లింగసముద్రం ఘటనపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.