
Ap News: ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వస్తేనే క్వారంటైన్కి పంపిస్తాం: ఆళ్ల నాని
అమరావతి: విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి ఆర్టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి అని.. ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వస్తేనే క్వారంటైన్కు పంపిస్తామని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కొవిడ్పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వివరాలను మీడియాకు వెల్లడించారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్తో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయని.. అది రాష్ట్రానికి రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించినట్లు చెప్పారు. కొవిడ్ వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారన్నారు. వచ్చే ఏడాది జనవరి 15నాటికి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవ్వాలని సీఎం ఆదేశించినట్లు వెల్లడించారు.
‘‘కొవిడ్ను ఎదుర్కొనేందుకు 104 సహా అవసరమైన చర్యల సన్నద్ధతపై చర్చించాం. ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. ప్రజల్లో అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలి. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. మాస్కులు ధరించడంలో నిర్లక్ష్యం వద్దు. మాస్కులు ధరించని వారిపై చర్యలు తీసుకుంటాం. దక్షిణాఫ్రికా నుంచి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వస్తోందని కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది. కేంద్రం ముందస్తు హెచ్చరికలు సహా మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్రం ఆదేశాలు, సూచనలు తప్పనిసరిగా అమలు చేస్తాం. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదు. కొత్త వేరియంట్పై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని సీఎం జగన్ చెప్పినట్లు ఆళ్ల నాని వివరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.