AP News: పోలీస్‌శాఖలో పోస్టల్‌ బ్యాలెట్ల కలకలం.. కానిస్టేబుల్‌ వీడియో వైరల్‌

ప్రకాశం జిల్లాలోని సుమారు 700 పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల వివరాలను ఓ పార్టీకి ఇచ్చామంటూ స్పెషల్ బ్రాంచ్‌ హెడ్ కానిస్టేబుల్

Updated : 09 Aug 2021 13:50 IST

ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని సుమారు 700 పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల వివరాలను ఓ పార్టీకి ఇచ్చామంటూ స్పెషల్ బ్రాంచ్‌ హెడ్ కానిస్టేబుల్ నర్రా వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు.. తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రస్తుత పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన ఉద్యోగులకు న్యాయం చేయాలంటూ కానిస్టేబుల్ కోరిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాల్‌చల్‌ చేస్తోంది. పలు శాఖల ప్రభుత్వ ఉద్యోగులతో గతనెల 30న ఒంగోలులో జరిగిన ప్రత్యేక సమావేశంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ సమావేశంలోనే  హెడ్ కానిస్టేబుల్ నర్రా వెంకటరెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో తనతోపాటు మరో ఆరుగురు పోస్టల్ బ్యాలెట్లను సేకరించామని.. తమ కృషికి మేలు చేసే పరిస్థితి కల్పించాలని కోరారు. గత ప్రభుత్వంలో ఉన్నవారే ఇప్పటికీ కీలక స్థానాల్లో ఉన్నారని.. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లామని చెప్పారు. మీరైనా న్యాయం చేయాలని ప్రణీత్ రెడ్డిని కోరారు. ఆ వ్యాఖ్యల వీడియో వారం రోజుల తర్వాత సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి రావడంతో తీవ్రంగా పరిగణించిన ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్.. కానిస్టేబుల్‌ను వేకెన్సీ రిజర్వు (వీఆర్)కు  పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమావేశానికి ఎవరెవరు హాజరయ్యారనే కోణంలో పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని