ల్యాండ్‌ అగ్రిమెంట్‌ లేకుండా అమ్మేస్తున్నారు..: క్రెడాయ్‌ అధ్యక్షుడు రామకృష్ణారావు

అనుమతులు లేకుండా అనేక పేర్లతో ఆస్తుల విక్రయాలు చేపడుతున్నారని.. ల్యాండ్ అగ్రిమెంట్ కూడా చేసుకోకుండా అమ్మేస్తున్నారని క్రెడాయ్‌ హైదరాబాద్‌ 

Updated : 26 Nov 2021 16:08 IST

హైదరాబాద్‌: అనుమతులు లేకుండా అనేక పేర్లతో ఆస్తుల విక్రయాలు చేపడుతున్నారని.. ల్యాండ్ అగ్రిమెంట్ కూడా చేసుకోకుండా అమ్మేస్తున్నారని క్రెడాయ్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు రామకృష్ణారావు అన్నారు. అలా పెట్టుబడి పెడితే భద్రత ఉండదని.. ఏ ఫోరమ్‌లకు వెళ్లినా ఉపయోగం ఉండదని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ స్థిరాస్తి రంగానికి దేశవ్యాప్తంగా మంచి పేరుందని.. అదిపోతే తిరిగి తెచ్చుకోవడం కష్టమన్నారు. ఈ పరిస్థితుల్లో అనధికార, అనుమతి లేని ఆస్తుల విక్రయాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని కోరారు. సంబంధిత సంస్థలు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో హైదరాబాద్‌ స్థిరాస్తి రంగం మసకబారుతుందన్నారు. సగం ధరకే విక్రయాలు చేయడం వల్ల అనుకున్న సమయానికి డెలివరీ ఉండదని.. ఒకవేళ ఉన్నా నాణ్యతా ప్రమాణాలు సక్రమంగా ఉండవన్నారు.

రేరా అనుమతి ఉంటేనే..

క్రెడాయ్‌ తెలంగాణ ఛైర్మన్‌ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కొందరు రేరా (రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ) రిజిస్ట్రేషన్లు లేకుండా అమ్మకాలు చేస్తున్నారన్నారు. కొనుగోలుదారుల హక్కుల కోసమే రేరా వచ్చిందని.. ఇది వారికి రక్షణ కల్పిస్తుందని చెప్పారు. దీంతో నిర్దేశిత సమయానికి ఆస్తి డెలివరీ అవుతుందన్నారు. ఇప్పటికైనా అనుమతిలేని అమ్మకాలను డెవలపర్స్‌ ఆపాలని కోరారు. కొనుగోలుదారులు కూడా రేరా అనుమతి ఉన్న ప్రాజెక్టుల నుంచి మాత్రమే కొనాలని రామచంద్రారెడ్డి సూచించారు. 

ఒక ఆస్తిని వంద మంది కొనుగోలు చేస్తే..

రేరా అనుమతి లేకుండా కొనుగోలు చేస్తే వచ్చే ఇబ్బందులను గుర్తుంచుకోవాలని క్రెడాయ్‌ తెలంగాణ అధ్యక్షుడు మురళీకృష్ణారెడ్డి సూచించారు. మాయ మాటలకు మోసపోయి ఇబ్బందులు పడొద్దన్నారు. బయట నుంచి వచ్చినవారు తెలియకుండా కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. అనుమతిలేని ఆస్తులను విక్రయించడం వల్ల హైదరాబాద్‌కు ఉన్న బ్రాండ్‌ దెబ్బతింటుందన్నారు. ట్రేడ్‌ అధ్యక్షుడు చలపతిరావు మాట్లాడుతూ అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్టుల్లోనే కొనుగోలు చేయాలని సూచించారు. అనుమతి లేని ఒక ఆస్తిని వందమందికి కొనుగోలు చేసి మోసపోతే ప్రశ్నించే అవకాశం ఉండదన్నారు. ఆ వంద మందీ ఒకేతాటిపైకి వచ్చి పోరాడలేక ఆస్తిని వదులుకోవాల్సి వస్తుందని చెప్పారు. కొందరు డెవలపర్స్‌ చేస్తున్న మోసాలకు గురికావొదన్నారు. ఫ్రీ, ఆన్ డివైడెడ్ సేల్స్ పేరుతో జరిగే మోసాలను అడ్డుకునేందుకే తాము ఈ విధంగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని