AP News: ఉద్యోగుల సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించాలి: సీఎస్‌

వేతన సవరణపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం మరోమారు చర్చలు జరిపింది. అమరావతి సచివాలయంలో ఆర్థిక శాఖ, ఇతర శాఖల కార్యదర్శులతో ఉద్యోగ సంఘాల

Updated : 24 Dec 2022 15:17 IST

అమరావతి: వేతన సవరణపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం మరోమారు చర్చలు జరిపింది. అమరావతి సచివాలయంలో ఆర్థిక శాఖ, ఇతర శాఖల కార్యదర్శులతో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో గుర్తింపు పొందిన సంఘాల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. పీఆర్సీతో పాటు ఆర్థికేతర అంశాల వారీగా సంఘాలతో ప్రతినిధులతో ప్రభుత్వం చర్చించింది. వీలున్నంతవరకు ఉద్యోగుల సమస్యలను సకాలంలో పరిష్కరించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ కార్యదర్శులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో సమస్యలను కలెక్టర్లు.. జాయింట్‌ స్టాఫ్ కౌన్సిల్‌  ఏర్పాటు చేసి పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. వివిధశాఖల్లో ఉద్యోగుల పదోన్నతులపై వచ్చే ఏడాది నుంచి డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ క్యాలెండర్లు రూపొందించాలని సీఎస్‌ నిర్దేశించారు.

సీఎం వద్దే ఫిట్‌మెంట్‌ తేల్చుకుంటాం: బండి శ్రీనివాసరావు

‘‘జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఇచ్చిన 71 డిమాండ్లపై అధికారులు సమావేశంలో చర్చించారు. జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ, వైద్య బిల్లులు, విశ్రాంత ఉద్యోగుల బెనిఫిట్స్‌ త్వరలో ఇస్తామని అధికారులు చెప్పారు. మొత్తం రూ.1600 కోట్ల విలువైన బెనిఫిట్స్‌ ఇస్తామన్నారు.  మార్చిలోపు అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పీఆర్సీకి సంబంధించి అందరం ఒక్కమాటపై ఉన్నాం. ముఖ్యమంత్రి వద్దే ఫిట్‌మెట్‌ తేల్చుకుంటాం. అధికారుల కమిటీ సిఫారసులను అంగీకరించేది లేదని స్పష్టం చేశాం. వచ్చేవారం పీఆర్సీపై సీఎంకు అన్ని వివరాలు చెబుతామని సీఎస్‌ హామీ ఇచ్చారు’’ అని బండి శ్రీనివాసరావు తెలిపారు.

కాలయాపనే తప్ప సమావేశంతో ఉపయోగం లేదు: బొప్పరాజు

‘‘పీఆర్సీపై ఇప్పటికే చాలా సమావేశాలు జరిగాయి. 40 అంశాలపై ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. ఇప్పుడు నిర్వహించిన సమావేశం కాలయాపనే తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రకరకాల వ్యాఖ్యలు చేస్తున్న కారణంగా ఉద్యోగుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగ సంఘాలతో సీఎం సమావేశం త్వరలోనే ఏర్పాటు చేయాలని కోరాం. నాలుగు రోజుల్లో సీఎం వద్ద ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు’’ అని అమరావతి జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని