TS News: మంత్రి కేటీఆర్‌కు ఫ్రాన్స్ ప్రభుత్వం ఆహ్వానం

ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలు, దేశాల నుంచి ఆహ్వానం అందుకున్న మంత్రి కేటీఆర్‌ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం దక్కింది. ఫ్రాన్స్ ప్రభుత్వం తమ సెనెట్‌లో ప్రసంగించాల్సిందిగా కేటీఆర్‌కు ఆహ్వానం పంపింది. ఈనెల 29న ఫ్రాన్స్ సెనెట్‌లో జరిగే ఆంబిషన్‌ ఇండియా బిజినెస్‌ ఫోరం సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొని...

Published : 13 Oct 2021 18:52 IST

హైదరాబాద్‌: ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలు, దేశాల నుంచి ఆహ్వానం అందుకున్న మంత్రి కేటీఆర్‌ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం దక్కింది. ఫ్రాన్స్ ప్రభుత్వం తమ సెనెట్‌లో ప్రసంగించాల్సిందిగా కేటీఆర్‌కు ఆహ్వానం పంపింది. ఈనెల 29న ఫ్రాన్స్ సెనెట్‌లో జరిగే ఆంబిషన్‌ ఇండియా బిజినెస్‌ ఫోరం సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ఫ్రాన్స్ ప్రధాన మంత్రి ఇమ్మాన్యూల్‌ మాక్రోన్‌ సారథ్యంలో ఏర్పాటయిన ఈ సదస్సు భారత్‌-ఫ్రాన్స్ దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతానికి దోహదం చేస్తుందని మంత్రి కేటీఆర్‌కు పంపిన లేఖలో ఫ్రాన్స్ ప్రభుత్వం పేర్కొంది.

ఆంబిషన్‌ ఇండియా-2021 సదస్సులో కీనోట్‌ స్పీకర్‌గా పాల్గొని ‘గ్రోత్‌- డ్రాఫ్టింగ్‌ ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండో ఫ్రాన్స్ రిలేషన్స్‌ ఇన్‌ పోస్ట్‌ కొవిడ్‌’ అనే అంశంపై తన అభిప్రాయాలు పంచుకోవాలని మంత్రి కేటీఆర్‌ని ఫ్రాన్స్‌ ప్రభుత్వం కోరింది. గతంలో నిర్వహించిన ఆంబిషన్‌ ఇండియా సదస్సులో సుమారు 700 మంది వ్యాపార, వాణిజ్య భాగస్వాములు, 400కు పైగా ఇరు దేశాల కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారని, ఈసారి అంతకుమించి కంపెనీల భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నామని లేఖలో పేర్కొంది. ఇలాంటి కీలకమైన వేదిక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాలను పరిచయం చేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి కేటీఆర్‌కు పంపిన లేఖలో ఫ్రాన్స్ ప్రభుత్వం పేర్కొంది. ఫ్రాన్స్ దేశ ఆహ్వానం పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్.. ఈ సదస్సు ద్వారా తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను పరిచయం చేసే అవకాశం కలుగుతుందని, ఫ్రాన్స్‌ దేశపు ఆహ్వానం తెలంగాణ ప్రభుత్వ విధానాలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని