TS News: హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలకు మార్గదర్శకాలు జారీ
కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారా? అయితే, ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ సీపీ
హైదరాబాద్: కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారా? అయితే, ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మార్గదర్శకాలు జారీ చేశారు. ఒమిక్రాన్ నేపథ్యంలో నయాసాల్ వేడుకలపై ఆంక్షలు విధించారు. అర్ధరాత్రి 12 వరకూ మద్యం దుకాణాలు, అర్ధరాత్రి ఒంటిగంట వరకూ బార్లు, పబ్బుల్లో మద్యం సరఫరా ఉంటుందని నిన్న ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా... నూతన సంవత్సర వేడుకలను నియంత్రించాలన్న ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఇటీవల కరోనా పరిస్థితులపై విచారణ సందర్భంగా ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకల్లో జనం గుమిగూడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం పట్టించుకోలేదని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ఇవాళ సీజే ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ పిటిషన్పై రేపు విచారణ చేపట్టేందుకు పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఈనేపథ్యంలో తాజాగా హైదరాబాద్ సీపీ మార్గదర్శకాలు జారీ చేశారు. పబ్బులు, హోటళ్లు, క్లబ్లు మార్గదర్శకాలు పాటించాలని ఆదేశించారు.
న్యూ ఇయర్ వేడుకలకు మార్గదర్శకాలివే...
* వేడుకల్లో మాస్క్ లేకపోతే రూ.వెయ్యి జరిమానా.
* రెండు డోసుల టీకా తీసుకున్న వారికే వేడుకలకు అనుమతి.
* వేడుకల్లో భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి.
* వేడుకలకు రెండ్రోజుల ముందు అనుమతి తప్పనిసరి.
* సిబ్బందికి 48గంటల ముందు కొవిడ్ పరీక్షలు చేయాలి.
* బహిరంగ వేడుకల్లో డీజేకు అనుమతి లేదు.
* ధ్వని కాలుష్యంపై ఫిర్యాదు వస్తే చర్యలు.
* మద్యం సేవించి వాహనం నడిపితే 6 నెలల జైలు, రూ.10వేల జరిమానా
* అసభ్యకర దుస్తులు ధరించినా.. నృత్యాలు చేసినా చర్యలు.
* వేడుకల్లో మాదక ద్రవ్యాలకు అనుమతిస్తే చర్యలు. విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తాం. మహిళలపై వేధింపులను అరికట్టడానికి షీ బృందాలు, పోలీసులతో నిఘా ఏర్పాటు చేయనున్నట్టు సీపీ ఆనంద్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.