krishna floods: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆల్మట్టి నుంచి కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరుగులు పెడుతోంది. దీంతో జూరాల జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది...

Published : 25 Jul 2021 20:35 IST

శ్రీశైలం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆల్మట్టి నుంచి కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరుగులు పెడుతోంది. దీంతో జూరాల జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. జూరాలకు 3.94 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 4.06 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లకు గాను ప్రస్తుతం 316.607 మీటర్ల నీటిమట్టం ఉంది. జూరాల నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 6.20 టీఎంసీలుగా ఉంది.

శ్రీశైలం జలాశయానికి 4.5 లక్షల క్యూసెక్కులకుపైగా వరదనీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 863.7 అడుగులకు చేరింది. గరిష్ఠ నీటినిల్వ 215.8 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం 117.77 టీఎంసీలుగా ఉంది. ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 31వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

ప్రకాశం బ్యారేజ్‌ వద్ద తగ్గుతున్న వరద

విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ వద్ద వరద ఉద్ధృతి తగ్గుతోంది. ప్రకాశం బ్యారేజ్‌ ఇన్‌ఫ్లో 50,840 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 51,940 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజ్‌ నుంచి కాలువలకు 3,631 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజ్‌ 70 గేట్లు అడుగు మేరకు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.

తుంగభద్రకు భారీగా వరద

తుంగభద్ర జలాశయానికి భారీగా వరదనీరు వస్తుండటతో పూర్తిగా నిండిపోయింది. దీంతో జలాశయం నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాలుగు గేట్ల ద్వారా సుమారు 20వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర నుంచి హెచ్‌ఎల్‌సీకి వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని అధికారులు తెలిపారు. రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి దంపతులు పూర్ణకుంభంతో తుంగభద్ర జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని