
AP News: ఈ విద్యార్థులు ‘జాతిరత్నాలు’.. తగ్గేదేలే అంటూ ప్రిన్సిపల్కు లేఖ
విశాఖ: పర్సనల్ లీవ్ కావాలని ఒకప్పుడు టీచర్ను అడగాలంటేనే విద్యార్థులు భయపడిపోయేవారు. కానీ ఇప్పుడు విద్యార్థుల టైం మారింది.. టైమింగూ మారింది. సినిమా కోసం సెలవు కావాలంటూ విశాఖలో ఇంటర్ విద్యార్థులు ఏకంగా ప్రిన్సిపల్కే లేఖ రాశారు. ఈ నెల 17న ‘పుష్ప’ సినిమా రిలీజ్ అవ్వగా.. దానికి ముందు రోజు ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థులు లేఖ రాశారు. మరుసటి రోజు కాలేజీకి సెలవు ప్రకటించాలని కోరారు. సెలవు ఇవ్వకపోయినా తాము రాకపోవడం మాత్రం పక్కా అని పేర్కొన్నారు.
ఇంటికి మెసేజ్లు పంపొద్దని, కాల్స్ చేయొద్దని లేఖలో ప్రిన్సిపల్ను కోరారు. సెలవు ఇవ్వాలంటూ కోరుతూనే.. చివర్లో ‘తగ్గేదేలే’ అంటూ ప్రిన్సిపల్కు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. తమ వద్ద ఓ అదనపు టికెట్ ఉందని కావాలంటే జాయిన్ కావొచ్చని ఆహ్వానించారు. మరి ఆ తర్వాతి రోజు విద్యార్థులతో కలిసి ప్రిన్సిపల్ సినిమాకు వెళ్లారో లేదో వాళ్లకే తెలియాలి. ఈ లేఖను సామాజిక మాధ్యమాల్లో చూస్తున్న నెటిజన్లు.. ఈ విద్యార్థులు ‘జాతిరత్నాలు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.