Telangana tourism: తెలంగాణకు రూ.300కోట్లకుపైగా నిధులు మంజూరు చేశాం: కిషన్‌రెడ్డి

తెలంగాణలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల కల్పనకు స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం రూ. 300 కోట్లకుపైగా నిధులు

Updated : 24 Sep 2022 16:59 IST

దిల్లీ: తెలంగాణలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల కల్పనకు స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం రూ. 300 కోట్లకుపైగా నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. స్వదేశ్ దర్శన్ పథకంలో భాగంగా రాష్ట్రంలో మూడు పర్యాటక సర్క్యూట్స్ అభివృద్ధికి రూ. 268.39 కోట్లు, ప్రసాద్ పథకం కింద రూ. 36.73 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన లేఖకు సమాధానంగా కిషన్ రెడ్డి ఈ వివరాలు వెల్లడించారు.

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎకో సర్క్యూట్ కోసం 2015-16లో రూ.91.62 కోట్లు, ములుగు-లక్నవరం-మేడారం-తాడ్వాయి-దామరవి-మల్లూరు-బొగత జలపాతాన్ని కలుపుతూ ట్రైబల్ సర్క్యూట్ కింద చేపట్టనున్న అభివృద్ధి పనులకు 2016-17లో రూ.79.87 కోట్లు, కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్-పైగా టూంబ్స్-హయత్ బక్షి మస్క్-రేమండ్స్ టూంబ్ లను కలుపుతూ హెరిటేజ్ సర్క్యూట్ కింద చేపట్టనున్న అభివృద్ధి పనులకు 2017-18లో రూ.96.90 కోట్లు మంజూరు చేసినట్టు లేఖలో పేర్కొన్నారు. ప్రసాద్ పథకం కింద ఆలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారి ఆలయం అభివృద్ధికి 2020-21లో రూ. 36.73 కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్ర మార్గదర్శకాలను అనుసరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రతిపాదనలు పంపిస్తే, వాటిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని కిషన్‌ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని