KRMB: కేఆర్‌ఎంబీ కీలక ప్రకటన.. ఈనెల 14 నుంచి గెజిట్‌ అమలు

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 14 నుంచి గెజిట్‌ నోటిఫికేషన్‌ అమల్లోకి వస్తున్నట్లు కృష్ణా

Updated : 12 Oct 2021 17:06 IST

హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 14 నుంచి గెజిట్‌ నోటిఫికేషన్‌ అమల్లోకి వస్తుందని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ప్రకటించింది. రెండో షెడ్యూల్‌లోని అన్ని డైరెక్ట్‌ అవుట్‌లెట్లను బోర్డు పరిధిలోకి తీసుకోనున్నట్లు కేఆర్‌ఎంబీ తెలిపింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జుసాగర్‌ ప్రాజెక్టుల అన్ని డైరెక్ట్‌ అవుట్‌లెట్లు బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. అవుట్‌లెట్ల అప్పగింతకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు రావాలని కేఆర్‌ఎంబీ కోరింది.

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్రం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు నేపథ్యంలో మొదటి దశలో ఐదు ప్రాజెక్టుల పరిధిలోని 29 కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకోవడానికి అవకాశం ఉన్నట్లు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం గుర్తించింది. మిగిలిన చోట్ల రెండు రాష్ట్రాలకు కొన్ని అభ్యంతరాలుండటం వల్ల ప్రస్తుతానికి వీలు కాదని పేర్కొంది. ప్రాజెక్టుల వారీగా సిబ్బంది, కార్యాలయాలు, యంత్రాలు, పరికరాలు ఇలా అన్ని అంశాలపై సమగ్రంగా ముసాయిదా తయారు చేసింది. కృష్ణా, గోదావరి బోర్డులకు సంబంధించి కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుపై రెండు బోర్డులూ రెండు ఉపసంఘాలను నియమించాయి. ఇందులో కృష్ణా బేసిన్‌ కీలకమైంది. ఈ కమిటీలో రెండు రాష్ట్రాల నుంచి నీటిపారుదల, జెన్‌కోలకు చెందిన నలుగురు చీఫ్‌ ఇంజినీర్లతో పాటు, కృష్ణా బోర్డు నుంచి ఐదుగురు ఉన్నారు. బోర్డుకు చెందిన రవికుమార్‌ పిళ్లై ఈ ఉపసంఘానికి కన్వీనర్‌గా ఉన్నారు. ఈ కమిటీ తయారు చేసిన ముసాయిదాపై ఇవాళ జరిగిన బోర్డు సమావేశంలో చర్చించారు. ఈ నెల 14 నుంచి గెజిట్‌ నోటిఫికేషన్‌ అమల్లోకి రానున్నట్లు కేఆర్‌ఎంబీ ప్రకటించింది.

ప్రాజెక్టుల కింద 29 కేంద్రాలు ఏవంటే..

శ్రీశైలం.. ఆంధ్రప్రదేశ్‌లో

* శ్రీశైలం స్పిల్‌వే

* కుడి విద్యుత్తు కేంద్రం

* పోతిరెడ్డిపాడు

* హంద్రీనీవా ఎత్తిపోతలకు నీటిని తీసుకొనే పంపుహౌస్‌

* ముచ్చుమర్రి పంపుహౌస్‌

తెలంగాణలో...

* ఎడమ విద్యుత్తు కేంద్రం

* కల్వకుర్తి ఎత్తిపోతల మొదటి పంపుహౌస్‌

* నాగార్జునసాగర్‌ కింద అత్యధికంగా 15 పాయింట్లున్నాయి. హెడ్‌వర్క్స్‌, కుడి, ఎడమ కాలువలతోపాటు, ప్రధాన విద్యుత్తు హౌస్‌, ఎడమ కాలువ కింద అనేక పాయింట్లు ఉన్నాయి. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఎ.ఎం.ఆర్‌.పి) లిప్టును కూడా మొదటి దశలో చేర్చారు.

* నాగార్జునసాగర్‌ టెయిల్‌ పాండ్‌ కింద హెడ్‌వర్క్స్‌, విద్యుత్తు బ్లాక్‌

* పులిచింతల కింద హెడ్‌వర్క్స్‌, విద్యుత్తు బ్లాక్‌

* కేసీకాలువ కింద సుంకేశుల  బీ ఆర్డీఎస్‌ కింద క్రాస్‌ రెగ్యులేటర్‌

* తుమ్మిళ్ల ఎత్తిపోతల


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని