
అభ్యంతరాలున్న ప్రాజెక్టుల వివరాలివ్వలేం: ఏపీ ఈఎన్సీ
జలసౌధలో కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సమన్వయ కమిటీ భేటీ
హైదరాబాద్: నగరంలోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)ల సమన్వయ కమిటీ భేటీ అయింది. తెలుగు రాష్ట్రాల్లో నదీ జలాల అంశంలో కేంద్ర జల్శక్తి శాఖ జారీ చేసిన గెజిట్ ప్రకారం ప్రాజెక్టుల స్వరూపం, ఇతర వివరాలు ఇవ్వాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను బోర్డులు కోరాయి. గెజిట్ నోటిఫికేషన్లో చేర్చిన ప్రాజెక్టులపై అభ్యంతరాలు ఉన్నాయని.. వాటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నామని ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) నారాయణరెడ్డి చెప్పారు. అభ్యంతరాలున్న ప్రాజెక్టుల వివరాలు ఇవ్వలేమని తెలిపారు. వివరాలు ఇచ్చి అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని బోర్డులు సూచించాయి. దీనిపై తమ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని ఏపీ ఈఎన్సీ సమాధానమిచ్చారు. సమన్వయ కమిటీ సమావేశాలు ఇకపై తరచూ జరుగుతుంటాయని బోర్డులు తెలిపాయి. ఆగస్టు రెండో వారంలో బోర్డు పూర్తి సమావేశాన్ని నిర్వహిస్తామని జీఆర్ఎంబీ స్పష్టం చేసింది. సమావేశం అనంతరం ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గెజిట్ నోటిఫికేషన్లోని కొన్ని అంశాలపై మరింత సృష్టత కోరామని చెప్పారు.
అంతకుముందు గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర జల్శక్తి శాఖ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. ఈ భేటీకి బోర్డు సభ్య కార్యదర్శి బీపీ పాండే, బోర్డు సభ్యులు, కేంద్ర జల్శక్తి శాఖ ప్రతినిధి, ఏపీ ఈఎన్సీలు నారాయణరెడ్డి, సతీశ్, ఏపీ ట్రాన్స్కో, జెన్కో ఎండీలు హాజరయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ సభ్యులు హాజరుకాలేదు.