Omicron: ముక్కు కారటం, తలనొప్పి, అలసట.. ఒమిక్రాన్‌ లక్షణాలు!

ముక్కు కారటం, తలనొప్పి, అలసట, తుమ్ములు, గొంతు నొప్పి.. ఇవే కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ లక్షణాలని......

Updated : 20 Dec 2021 01:29 IST

విశ్లేషించిన లండన్‌లోని ZOE వ్యవస్థ

లండన్‌: కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే 90 దేశాల్లో ఈ కేసులు వెలుగుచూడగా.. ఆయా దేశాల్లో రోజురోజుకు కొత్త కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు ఈ వేరియంట్‌ లక్షణాలపై ఇంకా స్పష్టతలేదు. లక్షణాలపై పూర్తి సమాచారం తెలుసుకునేందుకు మరిన్ని రోజులు పట్టొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొద్దిరోజుల క్రితమే పేర్కొంది. అయితే కొవిడ్‌ లక్షణాలను అంచనా వేసేందుకు బ్రిటన్‌లోని లండన్‌ అధికారులు రూపొందించిన జో (ZOE) వ్యవస్థ ద్వారా ఒమిక్రాన్‌ లక్షణాలను విశ్లేషించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ముక్కు కారటం, తలనొప్పి, అలసట, తుమ్ములు, గొంతు నొప్పి.. ఇవే కొత్త వేరియంట్‌ లక్షణాలని పేర్కొంది. సాధారణ జలుబుకు ఉండే లక్షణాలు ఉన్నట్లు తెలిపింది.

బ్రిటన్‌లో ఒమిక్రాన్‌ సోకి ఆసుపత్రులు, ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న అనేక మంది తెలిపిన వివరాల ప్రకారం వారు ఈ జాబితాను వెలువడించారు. ప్రమాదకర డెల్టా వేరియంట్‌కు ఉండే నిరంతర దగ్గు, అధిక ఉష్ణోగ్రత, రుచి సహా వాసన కోల్పోవడం వంటి లక్షణాలేవీ లేవని కనుగొన్నారు. ‘జలుబు లక్షణాలైన ముక్కు కారటం, తలనొప్పి, గొంతు నొప్పి, తుమ్ములు వంటి లక్షణాలు ఉంటే ప్రజలు కొవిడ్‌గా భావించి ఇంట్లోనే ఉండాలి’ అని ZOE వ్యవస్థ ప్రధాన శాస్త్రవేత్త టిమ్ స్పెక్టర్ సూచించారు. క్రిస్మస్‌ పండగ సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి లక్షణాలు ఉండే స్నేహితులు, బంధువులకు దూరంగా ఉండాలని కోరారు.

ఒమిక్రాన్‌ కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. 89 దేశాల్లో ఈ వేరియంట్​ను గుర్తించినట్లు డబ్ల్యూహెచ్​ఓ వెల్లడించింది. డెల్టా వేరియంట్ కన్నా ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలిపింది. ముఖ్యంగా బ్రిటన్‌లో దీని ఉద్ధృతి కొనసాగుతోంది. రోజూ వేల సంఖ్యలో ఈ వేరియంట్‌ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన రెండురోజుల్లో 10 వేలకు పైగా కొత్త కేసులు నిర్ధరణ అయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. గత వారంతో పోలిస్తే ఈ వారం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 28.6 శాతం పెరిగినట్లు ప్రభుత్వ నివేదికలు తెలుపుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని