Omicron Test: రెండు గంటల్లోనే ఒమిక్రాన్‌ నిర్ధారణ..!

కేవలం రెండు గంటల్లోనే ఒమిక్రాన్‌ను గుర్తించే టెస్ట్‌ కిట్‌ను భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

Updated : 13 Dec 2021 04:46 IST

కొత్త టెస్ట్‌కిట్‌ రూపొందించిన ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తలు

గుహవాటి: ఆందోళనకర వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు భారత్‌లో క్రమంగా పెరుగుతున్నాయి. విదేశాల నుంచి వచ్చేవారికి నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నప్పటికీ పీసీఆర్‌ టెస్టుల్లో వీటిని గుర్తించడం కష్టంగా మారింది. ఒమిక్రాన్‌ను నిర్ధారించేందుకు పాజిటివ్‌ వచ్చిన నమూనాలకు జన్యు క్రమాన్ని విశ్లేషించాల్సి (జీనోమ్‌ సీక్వెన్సింగ్‌) వస్తోంది. ఇందుకు దాదాపు మూడు, నాలుగు రోజుల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో కేవలం రెండు గంటల్లోనే ఒమిక్రాన్‌ను గుర్తించే టెస్ట్‌ కిట్‌ను భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ల్యాబ్‌లలోనే అందుబాటులో ఉండే ఈ కిట్‌ల ద్వారా ఒమిక్రాన్‌ వేరియంట్‌ను అతితక్కువ సమయంలోనే గుర్తించవచ్చని ఐసీఎంఆర్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి పెరుగుతోన్న వేళ.. అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలోనే కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు. ఒకవేళ అందులో పాజిటివ్‌గా తేలితే వెంటనే ఆ నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపుతున్నారు. ఇలా ఒమిక్రాన్‌ వేరియంట్‌ను నిర్ధారించుకోవడానికి మూడు, నాలుగు రోజుల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌ను వేగంగా గుర్తించే సరికొత్త కొవిడ్‌ టెస్ట్‌ కిట్‌ను అస్సాంలోని ఐసీఎంఆర్‌ రీజినల్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (ICMR-RMRC) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. డాక్టర్‌ బిశ్వజ్యోతి బోర్కకోటి ఆధ్వర్యంలో నిపుణుల బృందం రూపొందించిన ఈ కిట్‌ను వెయ్యి మంది కొవిడ్‌ బాధితుల నమూనాలపై పరీక్షించారు. వీటిలో కచ్చితమైన ఫలితాలను వస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం వీటి లైసెన్సు జారీ ప్రక్రియ కొనసాగుతోందని.. వచ్చే వారంలోనే ఈ కిట్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఇదే సమయంలో ఈ కిట్‌లను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు కోల్‌కతాకు చెందిన జీసీసీ బయోటెక్‌తో ఐసీఎంఆర్‌ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఇవి యాంటీజెన్‌ టెస్ట్‌ కిట్‌ల మాదిరిగా ఎక్కడైనా ఉపయోగించే పరిస్థితి లేదు. కేవలం ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేసే కేంద్రాల్లోనే ఈ టెస్టు కిట్‌లు అందుబాటులోకి రానున్నాయి.

ఇదిలాఉంటే, దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 36కి చేరింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేసింది. ఈ నేపథ్యంలో వీటిని త్వరగా నిర్ధారించే పరీక్షల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని