AP News: ఉద్యోగుల పీఆర్‌సీ ప్రక్రియ ప్రారంభమైంది: సజ్జల 

పీఆర్‌సీ ప్రక్రియ ప్రారంభమైందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పీఆర్‌సీపై సీఎం జగన్‌తో సీఎస్‌ సమీర్‌శర్మ చర్చిస్తున్నారని,

Updated : 10 Nov 2021 20:29 IST

అమరావతి: ఉద్యోగుల పీఆర్‌సీ ప్రక్రియ ప్రారంభమైందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పీఆర్‌సీపై సీఎం జగన్‌తో సీఎస్‌ సమీర్‌శర్మ చర్చిస్తున్నారని, త్వరలో ప్రకటన ఉంటుందని వెల్లడించారు. దీనిపై గత నెలాఖరులో ప్రకటన చేయాలనుకున్నాం.. కానీ, వీలు కాలేదని చెప్పారు. ఇది పెద్ద అంశం కాదని పేర్కొన్నారు. పీఆర్సీ ప్రక్రియ కొంత ముందుగా మొదలై ఉంటే బాగుండేదని, సామరస్యంగానే ఫలితం ఉంటుందని తెలిపారు.

సచివాలయంలోనే ఉద్యోగ సంఘాల నేతలు...

పీఆర్సీ నివేదిక విడుదల చేయాలని కోరుతూ ఈరోజు మధ్యాహ్నం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మను ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాస్‌లు కలిశారు. పీఆర్సీ నివేదిక బహిర్గతం చేసేంత వరకు సచివాలయం నుంచి కదలబోమని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. సచివాలయం ప్రాంగణంలో బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ‘‘సీఎస్‌ ప్రకటన కోసం కొన్ని గంటలుగా నిరీక్షిస్తున్నాం. మా సహనాన్ని పరీక్షి్స్తున్నారని భావిస్తున్నాం. పీఆర్‌సీ నివేదికను సీల్డ్‌ కవర్‌లో పెట్టడం వింతగా ఉంది. నివేదికకే ఇబ్బంది పెడితే ఇక పీఆర్‌సీ ఎలా ఉంటుందో? పీఆర్‌సీ నివేదిక రాకుంటే రేపు భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తాం’’ అని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఈనేపథ్యంలో ప్రభుత్వ అనుమతి కోసం సీఎస్‌ సమీర్‌ శర్మ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి జగన్‌తో చర్చిస్తున్నారు. సీఎంతో భేటీ తర్వాత నివేదిక వెల్లడిస్తారని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి. ఈక్రమంలో పీఆర్‌సీ ప్రక్రియ ప్రారంభమైందని సజ్జల ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని