శ్రీశైలం, సాగర్‌ జలాశయాలకు వరద.. సాగర్‌ ఎడమ కాల్వకు నీటి విడుదల

శ్రీశైలం జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో 5,04,086 క్యూసెక్కులుగా ఉండగా....

Updated : 01 Aug 2021 17:03 IST

హైదరాబాద్: శ్రీశైలం జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో 5,04,086 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్‌ఫ్లో 5,30,175 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883.50 అడుగులకు నీరు చేరింది. శ్రీశైలం జలాశంయ పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా.. జలాశయంలో 207.41 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి జలాశయానికి వరద వస్తుండటంతో కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో అధికారులు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. పెద్ద సంఖ్యలో సందర్శకులు జలాశయం వద్దకు చేరుకుంటున్నారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న భక్తులు హైదరాబాద్‌ వైపు వెళ్తున్నారు. శ్రీశైలం-హైదరాబాద్‌ రోడ్డుపైకి అడ్డదిడ్డంగా వాహనాలు రావడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో ఘాట్‌రోడ్డుపై వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

నాగార్జున సాగర్‌ జలాశయం ఇన్‌ఫ్లో 4,14,526 క్యూసెక్కులు ఉండగా.. 36,572 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ జలాశయంలో ప్రస్తుతం 579.20 అడుగులు మేర నీరు చేరింది. జలాశయంలో గరిష్ఠ నీటి నిల్వ 312.04 టీఎంసీలుగా ఉండగా.. ప్రస్తుతం 280.69 టీఎంసీల నిల్వ ఉంది. సాగర్‌కు వరద నీరు వస్తుండటంలో సాగర్‌ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. వానాకాలం సాగు కోసం ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. ఎంపీ లింగయ్య, ఎమ్మెల్యే నోముల భగత్‌ ఎడమ కాల్వకు గేట్లు ఎత్తి 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. గంట గంటకు జలాశయంలోకి వరద ఉద్ధృతి పెరుగతున్నందున సాగర్‌ గేట్లు తెరిచేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు.

ఎగువన ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజ్‌కి 35,526 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. బ్యారేజ్‌ 36 గేట్లు అడుగు మేర ఎత్తి 26,892 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వాటిలో 8,634 క్యూసెక్కుల నీటిని బ్యారేజ్‌ నుంచి కాలువలకు వదులుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని