జగన్‌, విజయసాయి బెయిల్‌ రద్దు పిటిషన్లపై నేడు తీర్పు.. కొనసాగుతున్న ఉత్కంఠ 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Updated : 15 Sep 2021 11:13 IST

హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇద్దరి బెయిల్ రద్దు పిటిషన్లపై సీబీఐ కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించకుండా స్టే ఇవ్వడంతో పాటు..  బెయిల్‌ రద్దు పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రఘురామ మంగళవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు నుంచి కేసు బదిలీ చేయాలంటే సహేతుకమైన కారణాలు ఉండాలని, ఇక్కడ అలాంటివేవీ లేకుండా ఊహాజనిత కారణాలతో బదిలీ కోరుతున్నారని ఉన్నత న్యాయస్థానం నిన్న వ్యాఖ్యానించింది. దీనిపై వాదనలను విన్న న్యాయమూర్తి.. పిటిషన్ల బదిలీకి నిరాకరిస్తూ ఇవాళ తీర్పు వెల్లడించారు. మరోవైపు జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టేశారంటూ ట్వీట్ చేసిన సాక్షి మీడియాపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలన్న రఘురామ పిటిషన్‌పైనా నేడు సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేయనుంది.

జగన్‌, విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని రఘురామ వేసిన పిటిషన్‌లపై జులై 30న వాదనలు ముగించిన సీబీఐ కోర్టు.. గత నెల 24నే తీర్పు వెల్లడించనున్నట్లు ప్రకటించింది. అయితే జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై వాదనలు ముగిసిన తర్వాత.. విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని రఘురామ మరో పిటిషన్ దాఖలు చేశారు. రెండు పిటిషన్లలోనూ వాదనలు దాదాపు ఒకే తీరుగా జరిగాయి. గత నెల 24న విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై వాదనలు విన్న సీబీఐ కోర్టు.. రెండు పిటిషన్లపై ఒకే రోజు తీర్పు వెల్లడిస్తామంటూ తీర్పును ఈరోజుకి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని