
Ts News: ఆ ప్రాజెక్టు మినహా ఇతర ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవద్దు: తెలంగాణ ఈఎన్సీ
హైదరాబాద్: గోదావరిపై ఉన్న పెద్దవాగు మినహా ఇతర ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) ఛైర్మన్కు తెలంగాణ నీటిపారుదలశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) మురళీధర్ లేఖ రాశారు. పెద్దవాగు ప్రాజెక్టును మాత్రమే బోర్డు పరిధిలోకి తీసుకొనేందుకు ఇదివరకే నిర్ణయించామని.. అందుకు విరుద్ధంగా ఉపసంఘం సభ్యులెవరికీ సమాచారం లేకుండా బోర్డు అధికారులు ఇతర ప్రాజెక్టులను సందర్శించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సంప్రదాయాలకు విరుద్ధమని.. బోర్డు, ఉపసంఘం అనుమతి లేకుండా ఆ ప్రాజెక్టుల స్వాధీనం కోసం నివేదిక తయారు చేయడం తగదన్నారు. బోర్డు, ఉపసంఘం నిర్ణయాలకు అనుగుణంగానే బోర్డు కార్యాలయం పనిచేయాల్సి ఉంటుందని.. బోర్టు నిర్ణయాలతో సంబంధం లేకుండా వెళ్లిన అధికారుల అభిప్రాయాలు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. వీటన్నింటి నేపథ్యంలో పెద్దవాగు ప్రాజెక్టు మినహా తెలంగాణకు మాత్రమే నీరిచ్చే ఇతర ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రాజెక్టుల స్వాధీనం కోసం నివేదికల తయారీలో భాగస్వామ్యం కాబోమని స్పష్టం చేశారు.