Ts News: నెట్టెంపాడు ఎత్తిపోతలను ఒకటిగానే పరిగణించాలి: కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఈఎన్‌సీ లేఖ

నెట్టెంపాడు, జూరాల ప్రాజెక్టులను గెజిట్ నోటిఫికేషన్‌లోని రెండో షెడ్యూల్ నుంచి మూడో షెడ్యూల్ లోకి మార్చాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరింది. ఈ మేరకు బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖ రాసింది. కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర..

Published : 07 Dec 2021 22:17 IST

హైదరాబాద్‌: నెట్టెంపాడు, జూరాల ప్రాజెక్టులను గెజిట్ నోటిఫికేషన్‌లోని రెండో షెడ్యూల్ నుంచి మూడో షెడ్యూల్ లోకి మార్చాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరింది. ఈ మేరకు బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖ రాసింది. కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని నోటిఫికేషన్‌లో రెండు కాంపోనెంట్లుగా పేర్కొన్నారని.. రెండింటిని ఒకటిగానే పరిగణించి మార్పులు చేయాలన్నారు. నెట్టెంపాడు కాంపోనెంట్‌ను ఒకటి, రెండు షెడ్యూల్ నుంచి తొలగించాలని కోరారు. జూరాల ప్రాజెక్టుతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని కాంపోనెంట్లు పూర్తిగా తెలంగాణకు చెందినవేనని.. ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్‌తో ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు.

‘‘ఏపీతో సంబంధం లేని జూరాల ప్రాజెక్టు కాంపోనెంట్లు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిలో ఉండాల్సిన అవసరం లేదు. ఈ మేరకు జూరాల ప్రాజెక్టు కాంపోనెంట్లను రెండో షెడ్యూల్ నుంచి తొలగించి మూడో షెడ్యూల్‌లో చేర్చాలి. జూరాల ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని కాల్వల ద్వారా 9500 క్యూసెక్కులకు మించి నీటిని తరలించే పరిస్థితి లేదు. 2008 నుంచి 2021 వరకు జూన్, అక్టోబర్ మధ్య ప్రాజెక్టుకు సగటు ప్రవాహాలు 44వేల క్యూసెక్కులుగా ఉంది. దీంతో దిగువన ఉన్న నీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తెలంగాణ ప్రతిపాదించిన ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించాలని బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్‌ను తెలంగాణ ప్రభుత్వం కోరింది. తెలంగాణలోని కృష్ణా బేసిన్‌ పరిధిలో ఉన్న నీటి అవసరాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిగణనలోకి తీసుకోవాలి. చారిత్రక అన్యాయాలను సవరించి తెలంగాణకు న్యాయం చేయాలి. నెట్టెంపాడు ప్రాజెక్టు కాంపోనెంట్‌ను మొదటి, రెండు షెడ్యూళ్ల నుంచి... జూరాల ప్రాజెక్టు కాంపోనెంట్లను రెండో షెడ్యూల్ నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి’’ అని ఈఎన్‌సీ విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని