KTR: వచ్చే ఐదేళ్లలో ₹3 లక్షల కోట్ల ఎగుమతులు.. 10 లక్షల ఉద్యోగాలు: కేటీఆర్‌

ఐటీ, అనుబంధ రంగాల్లో వచ్చే ఐదేళ్లల్లో రూ.3 లక్షల కోట్ల ఎగుమతులు.. 10లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు

Updated : 16 Sep 2021 15:34 IST

హైదరాబాద్‌: ఐటీ, అనుబంధ రంగాల్లో వచ్చే ఐదేళ్లల్లో రూ.3 లక్షల కోట్ల ఎగుమతులు.. 10లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. దీంతో పాటు ఎలక్ట్రానిక్స్‌లో రూ.70 వేల కోట్లు పెట్టుబడులు సాధించటం లక్ష్యంగా చేసుకున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కంపెనీలను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తామని.. ఈ విషయంలో కంపెనీలు కూడా కలిసి రావాలని కోరారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2021-26 కాలానికి వర్తించే రెండో ‘ఇన్‌ఫర్‌మేషన్ అండ్ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ’ పాలసీని కేటీఆర్ ఆవిష్కరించారు.

కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన్పటితో పొలిస్తే ప్రస్తుతం ఐటీ ఎగుమతులు రెట్టింపు అయ్యాయన్నారు. గతేడాది రూ.1.45 లక్షల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరిగాయని వివరించారు. ఐటీ రంగంలో వార్షిక వృద్ధిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. ప్రపంచంలో 5 పెద్ద కంపెనీలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు. 7 శాతం ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి రాష్ట్రంలోనే అవుతోందన్నారు. ఈ-గవర్నెన్స్‌ ద్వారా సిటిజెన్‌ సేవలు కూడా అందిస్తున్నామని తెలిపారు. గ్లోబల్ సంస్థలతో కలిసి ఎమర్జింగ్‌ టెక్‌లో పురోగతి సాధించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ కొత్త పాలసీ ద్వారా పౌరులను మరింత చైతన్యవంతులను చేయాలన్నదే తమ ఉద్దేశమని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అమెరికా కౌన్సిల్‌ జనరల్‌ జోయల్‌ రిఫ్‌మెన్‌, సియంట్‌ ఛైర్మన్‌ మోహన్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని