KRMB: రేపటి భేటీకి హాజరుకాలేం.. బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం లేఖలు

కృష్ణా, గొదావరి బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖలు రాసింది. సోమవారం జరగనున్న బోర్డు భేటీకి హాజరు..

Updated : 08 Aug 2021 16:00 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సభ్యులు బోర్డు సమావేశానికి హాజరై అభిప్రాయాలు చెప్పేందుకు వీలుగా మరో తేదీని ఖరారు చేయాలని కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రెండు బోర్డులకు మరోమారు విడివిడిగా లేఖలు రాసింది. సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసుల విచారణ ఉన్నందున సోమవారం తలపెట్టిన బోర్డు భేటీకి హాజరు కాలేమని నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ గతంలోనే లేఖలు రాశారు. అయితే కార్యాచరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్న కేంద్ర జల్‌శక్తి శాఖ ఆదేశాల నేపథ్యంలో సమయాభావం వల్ల సమావేశాన్ని నిర్వహిస్తామని.. హాజరుకావాలని కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలు రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లీ లేఖ రాశాయి.

శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు కృష్ణా, గోదావరి బోర్డులకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరోమారు లేఖలు రాసింది. రెండు బోర్డుల ఛైర్మన్లకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ విడివిడిగా లేఖలు రాశారు. కేసుల విచారణ కారణంగా సోమవారం నిర్వహించే సమావేశానికి హాజరు కాలేమని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సభ్యులు బోర్డు భేటీకి హాజరై అభిప్రాయాలు చెప్పేందుకు వీలుగా మరో తేదీని సూచించాలని రెండు బోర్డులను కోరారు. పాలనాపరమైన అంశాలతో పాటు కృష్ణా జలాల వినియోగానికి సంబంధించిన అంశాలను కూడా తదుపరి సమావేశ ఎజెండాలో చేర్చాలని కేఆర్ఎంబీ ఛైర్మన్‌ను కోరారు. లేఖల ప్రతులను కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి కార్యాలయానికి కూడా పంపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని