
Ts News: నేడు తెలంగాణ వ్యాప్తంగా సెలవు.. ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్: నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గులాబ్ తుపాను ప్రభావం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా.. ముఖ్యంగా హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
గులాబ్ తుపాను నేపథ్యంలో భారీ వర్షాల కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్కుమార్తో తాజా పరిస్థితులపై సీఎం సమీక్షించారు. గులాబ్ తూపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురుస్తాయని.. ఈ పరిస్థితుల్లో ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ను ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.