TS High Court: గణేశ్‌ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు

తెలంగాణలో గణేశ్‌ ఉత్సవాలు, నిమజ్జనంపై రాష్ట్ర హైకోర్టు ఆంక్షలు విధించింది.

Updated : 09 Sep 2021 11:59 IST

హైదరాబాద్‌: తెలంగాణలో గణేశ్‌ ఉత్సవాలు, నిమజ్జనంపై రాష్ట్ర హైకోర్టు ఆంక్షలు విధించింది. హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ (పీవోపీ) విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని స్పష్టం చేసింది. అలాంటి విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుంటల్లో నిమజ్జనం చేయాలని సూచించింది. తమ ఉత్తర్వులను ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, పోలీసులు అమలు చేయాలని ఆదేశించింది. గణేశ్‌, దుర్గాదేవి విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలంటూ గతంలో న్యాయవాది మామిడి వేణుమాధవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం ఇటీవల సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. దీనిపై వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు.. తాజాగా తీర్పును వెలువరించింది.

ట్యాంక్‌బండ్‌ వైపు నిమజ్జనం చేయొద్దు..

హుస్సేన్‌సాగర్‌లో ట్యాంక్‌బండ్‌ వైపు నుంచి నిమజ్జనం చేయొద్దని.. పీవీ మార్గ్‌, నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్య పార్కు రోడ్డు తదితర ప్రాంతాల్లో చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. హుస్సేన్‌సాగర్‌లో పూర్తిగా కాకుండా ప్రత్యేకంగా రబ్బర్‌ డ్యాం తరహా ఏర్పాట్లు చేసి నిమజ్జనం చేయాలని ఆదేశించింది. నిమజ్జనం తర్వాత అక్కడి వ్యర్థాలను పూర్తిగా తొలగించాలని స్పష్టం చేసింది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు హుస్సేన్‌సాగర్‌ వైపు రాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం సూచించింది. ఇళ్లలోనే బకెట్లలో నిమజ్జనం పూర్తి చేసేలా చూడాలని పేర్కొంది.

రాత్రి 10 తర్వాత ధ్వని కాలుష్యం ఉండొద్దు..

నిమజ్జన కార్యక్రమాల్లో భక్తులు భౌతికదూరం పాటించేందుకు చర్యలు చేపట్టాలని.. నిమజ్జనం రోజు జీహెచ్‌ఎంసీ అధికారులు ఉచితంగా మాస్కులు పంపిణీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. పర్యావరణానికి విఘాతం కలిగించే విగ్రహాలను ప్రోత్సహించవద్దని.. రోడ్లపై ఆటంకం కలిగించేలా మండపాలు ఉండరాదని చెప్పింది. సాంస్కృతిక కార్యకలాపాలు నియంత్రణలో ఉండేలా చూడాలని ప్రభుత్వానికి సూచించింది. రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి ధ్వని కాలుష్యం రాకుండా చూడాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలపై ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని