Govt Lands Survey: సర్వే చేసి ప్రభుత్వ భూములను గుర్తించండి: తెలంగాణ హైకోర్టు

రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి ప్రభుత్వ భూములను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్

Published : 04 Aug 2021 15:16 IST

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి ప్రభుత్వ భూములను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ విక్రయాలు జరుగుతున్నట్టు తరచూ న్యాయస్థానం దృష్టికి వస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కలెక్టర్లు వెంటనే సర్వే చేపట్టి నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని తెలిపింది. ప్రభుత్వ భూములను గుర్తించి, జియో ట్యాగింగ్‌ ద్వారా సర్వే వివరాలతో రికార్డుల్లో నమోదు చేయాలని పేర్కొంది.

ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వ భూముల వివరాలను రిజిస్ట్రేషన్ అధికారులకు పంపించాలని ధర్మాసనం తెలిపింది. రికార్డుల్లోని ప్రభుత్వ భూములను సర్వే చేయొద్దని సబ్ రిజిస్ట్రార్లను కలెక్టర్లు ఆదేశించాలని స్పష్టం చేసింది. సబ్ రిజిస్ట్రార్లకు సందేహాలుంటే ముందుగా కలెక్టర్లను సంప్రదించాలని సూచించింది. ప్రభుత్వ భూముల సర్వే వివరాల నమోదును కలెక్టర్లు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని.. 33 జిల్లాల కలెక్టర్లు వేర్వేరుగా నివేదికలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులను వారం రోజుల్లో కలెక్టర్లకు పంపించాలని అడ్వొకేట్‌ జనరల్‌ను ఆదేశిస్తూ విచారణ అక్టోబరు 27కి వాయిదా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని