TS High Court: తెలంగాణలో ఆంక్షలు విధించండి: హైకోర్టు ఆదేశం

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. క్రిస్మస్‌, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకల్లో జాగ్రత్త చర్యలు చేపట్టాలని..

Updated : 23 Dec 2021 15:08 IST

హైదరాబాద్‌: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో క్రిస్‌మస్, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకలను నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వేడుకల్లో జనం గుమిగూడకుండా ఆంక్షలు విధిస్తూ రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కరోనా పరిస్థితులపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్రంలో ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతోందని.. ప్రభుత్వ, రాజకీయ కార్యక్రమాలు, సంప్రదాయ వేడుకల్లో మాస్కులు ధరించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించడం లేదని రవిచందర్, చిక్కుడు ప్రభాకర్, పవన్ కుమార్ తదితర న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో పలు ఉత్సవాల్లో జనం భారీగా గుమిగూడే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

దీనిపై స్పందించిన ధర్మాసనం వేడుకలను నియంత్రించాలని ఆదేశించింది. దిల్లీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయని విచారణ సందర్భంగా ప్రస్తావించింది. ఇతర రాష్ట్రాల నుంచి ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా.. సరిహద్దులు, రైల్వే స్టేషన్లు, ముఖ్యమైన బస్ స్టేషన్ల వద్ద స్క్రీనింగ్ పరీక్షలు జరపాలని.. గత నెల 21న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను జనవరి 4కి వాయిదా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని