
RTC MD sajjanar: ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు చర్యలు: సజ్జనార్
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ ఆర్టీసీ బస్ భవన్లోని ఛాంబర్ కార్యాలయంలో పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి ఎండీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త ప్రభుత్వంలో ఏడేళ్లుగా పూర్తి స్థాయి ఎండీని నియమించలేదు. సుదీర్ఘ కాలంగా ఇన్ఛార్జి బాధ్యతల మధ్య ఆర్టీసీ సంస్థ కొనసాగింది. పూర్తి స్థాయి ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్కు ఆర్టీసీలోని వివిధ విభాగాల ఈడీలు, ఇన్ఛార్జులు అయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ఆర్టీసీ గొప్ప పేరున్న సంస్థ. కరోనా వల్ల రవాణా, పర్యాటక రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఆర్టీసీపై భారం పెరిగింది. గత రెండేళ్లలో డీజిల్ ధర 22 రూపాయలు పెరిగింది. పెరుగుతున్న డీజిల్ ధరలు కూడా ఆర్టీసీపై భారాన్ని మరింత పెంచాయి. కరోనా సేవలు అందించడంతో ఆర్టీసీ సిబ్బంది కీలక పాత్ర పోషించారు. స్పేర్ పార్ట్స్ ధరలు కూడా ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు చర్యలు చేపడతాం. ప్రభుత్వానికి భారం కాకుండా సొంతంగా నిలబడేందుకు కృషి చేస్తాం. ఆర్టీసీ అభివృద్ధిపై కొత్త కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాం. కార్గో సేవలతో ఆర్టీసీ ఆదాయం కొంత పెరిగినా... మరింత పెంచాల్సి ఉంది. కరోనా సమయంలో ఇతర రాష్ట్రాల్లో ఆర్టీసీ సిబ్బందికి జీతాలు ఇచ్చేందకు ఇబ్బంది పడ్డారు.. కానీ, తెలంగాణలో ఆర్టీసీ సిబ్బందికి సకాలంలో జీతాలు అందించాం. అందుకు సీఎం కేసీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పూర్తి సహకారం అందించారు’’ అని సజ్జనార్ తెలిపారు.