TTD: వీఐపీలకు తితిదే విజ్ఞప్తి.. వైకుంఠద్వార దర్శనానికి సిఫారసు లేఖలు పంపొద్దు

జనవరి 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 22వ తేదీ అర్ధరాత్రి వరకు 10 రోజుల పాటు కల్పించే వైకుంఠ ద్వార దర్శనం కోసం వీఐపీలు సిఫారసు లేఖలు పంపవద్దని తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.

Updated : 02 Jan 2022 17:13 IST

తిరుమల: జనవరి 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 22వ తేదీ అర్ధరాత్రి వరకు 10 రోజుల పాటు కల్పించే వైకుంఠ ద్వార దర్శనం కోసం వీఐపీలు సిఫారసు లేఖలు పంపవద్దని తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్‌లో ముందుగానే దర్శనం టికెట్ బుక్ చేసుకున్న సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని తీసుకున్న ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని తితిదేకు సహకరించాలని ఆయన కోరారు.

పది రోజుల పాటు ఛైర్మన్ కార్యాలయంలో కూడా సిఫారసు లేఖలు స్వీకరించబోమని సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్ కారణంగా తిరుమలలో గదుల మరమ్మతులు చేపట్టినందువల్ల  వైకుంఠ ఏకాదశి రోజున ప్రజాప్రతినిధులకు తిరుమలలో ని నందకం, వకుళామాత అతిథి గృహాల్లో వసతి కల్పిస్తున్నామని చెప్పారు. తిరుమలలో వసతి సరిపోకపోతే  తిరుపతి లోనే బస చేసేందుకు సిద్ధపడి రావాలన్నారు. శ్రీవాణి ట్రస్ట్ భక్తులు తిరుపతి లోని మాధవం, శ్రీనివాసం, శ్రీపద్మావతి నిలయం, ఎస్వీ గెస్ట్ హౌస్ లో వసతి పొందాలని చైర్మన్ తెలిపారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా వీఐపీల దర్శన సమయం వీలైనంత తగ్గించి, సామాన్య భక్తులకు ఎక్కువ సమయం కేటాయించాలని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసిందని తితిదే ఛైర్మన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని