
AP News: చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు మరోసారి భారీ వర్ష సూచన!
అమరావతి: ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. ఈ నెల 29న అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడే సూచన ఉందని వెల్లడించింది. ఇది క్రమంగా బలపడి కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో నేటి నుంచి 30వరకు రాయలసీమ.. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో 13సెం.మీ కంటే ఎక్కువ వర్షం కురిసే సూచనలున్నాయని అంచనా వేస్తున్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
అప్రమత్తమైన చిత్తూరు జిల్లా యంత్రాంగం..
వాతావరణ శాఖ హెచ్చరికలతో చిత్తూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తూర్పు ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదుకు అవకాశం ఉందని కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పునరావాస కేంద్రాల ఏర్పాటుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కాజ్వేలు దాటొద్దని కోరారు. మరోవైపు చిత్తూరు జిల్లాలో నేడు విద్యాలయాలకు సెలవు ప్రకటించారు.