Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం..

Updated : 27 Feb 2024 15:26 IST

1. నీటి మళ్లింపునకు ట్రైబ్యునల్‌ అనుమతి లేదు.. కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఈఎన్‌సీ లేఖ

హంద్రీనీవా నుంచి కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్‌ వాడుకోకుండా చూడాలని తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) మురళీధర్‌ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ను కోరారు. ఈ మేరకు కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు ఈఎన్‌సీ లేఖ రాశారు. బచావత్‌ ట్రైబ్యునల్‌ ప్రకారం శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రం మాత్రమేనని పేర్కొన్నారు. హంద్రీనీవా నుంచి కృష్ణా బేసిన్‌ అవతలికి నీటి మళ్లింపునకు ట్రైబ్యునల్‌ అనుమతి లేదన్నారు. 

2. ఎంపీగా ఉన్నప్పటి నుంచి రేవంత్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు: మల్లారెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నువ్వానేనా అనేలా ఇద్దరు పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా రేవంత్‌రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎంపీగా ఉన్నప్పటి నుంచి రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. తెదేపా మల్కాజ్‌గిరి సీటు రేవంత్‌కు కాకుండా తనకు ఇచ్చినందుకు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారన్నారు.

ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డికి నాంపల్లి కోర్టు సమన్లు

3. ప్రజా సంగ్రామ యాత్రతో రాజకీయ మార్పు: బండి సంజయ్‌

తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కల్పించేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్రంలో రాజకీయ మార్పునకు ఈ యాత్ర వేదిక కానుందని చెప్పారు. పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని సందర్శించిన అనంతరం ప్రజా సంగ్రామ యాత్ర పేరిట చేపట్టిన పాదయాత్రను శనివారం ఆయన ప్రారంభించారు.

4. వివేకా పోస్టుమార్టం నివేదికపై సీబీఐ మరోసారి విచారణ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 83వ రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ అధికారులు ఇవాళ కడప రిమ్స్‌ డాక్టర్‌ ఆనంద నాయక్‌ను విచారించారు. వివేకా మృతదేహానికి ఆనంద నాయకే పోస్టుమార్టం నిర్వహించారు. కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు వివేకా పోస్టుమార్టం నివేదికను మరోసారి క్షుణ్నంగా పరిశీలించారు.

5. పాఠశాలలు తెరవడానికి ఇదే సరైన సమయం: సబితా ఇంద్రారెడ్డి

కరోనా అదుపులో ఉన్నందున విద్యా సంస్థల ప్రారంభానికి ఇదే సరైన సమయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సెప్టెంబరు 1 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మహబూబియా ప్రభుత్వ పాఠశాలలను ఆమె తనిఖీ చేసి అక్కడ చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఆన్‌లైన్‌ బోధనతో పూర్తిస్థాయి ప్రయోజనాలు నెరవేరడం లేదని.. అందుకే ప్రత్యక్ష బోధన కొనసాగుతుందన్నారు.

భూముల విక్రయానికి మరోమారు ప్రభుత్వం సిద్ధం.. ఎల్లుండే నోటిఫికేషన్‌

6. పండుగలొస్తున్నాయ్‌ జాగ్రత్త.. కొవిడ్‌ నిబంధనల్ని మళ్లీ పొడిగించిన కేంద్రం

దేశంలో కొన్నాళ్లుగా తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి పలు రాష్ట్రాల్లో మళ్లీ బుసలు కొడుతోంది. దీంతో అప్రమత్తమైన కేంద్రం దేశ వ్యాప్తంగా ప్రస్తుతం అమలులో ఉన్న కొవిడ్‌ నిబంధనలు, మార్దదర్శకాలను మరోసారి పొడిగించింది. సెప్టెంబర్‌ 30 వరకు కొవిడ్‌ నిబంధనలు అమలు చేయాలని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది.

7. తీన్మార్‌ మల్లన్నకు వచ్చే నెల 9 వరకు రిమాండ్‌

ప్రముఖ జర్నలిస్టు చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న)ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇటీవల డబ్బుల కోసం మల్లన్న బెదిరిస్తున్నాడని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి వచ్చే నెల 9 వరకు మల్లన్నకు రిమాండ్‌ విధించారు.

8. అష్రఫ్‌ ఘనీ యూఏఈకే ఎందుకు వెళ్లారు?

అఫ్గానిస్థాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన వెంటనే ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్‌ఘనీ అక్కడి నుంచి పలాయనం చిత్తగించిన విషయం తెలిసిందే. అయితే, తొలుత ఆయన తజకిస్థాన్‌ లేదా ఒమన్‌కి వెళ్లి ఉంటారని వార్తలు వచ్చాయి. కానీ, చివరకు ఆయన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)కి వెళ్లి సెటిలయ్యారు. మానవతా దృక్పథంతో ఆయనకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు యూఏఈ ప్రభుత్వం కూడా ప్రకటించింది.

9. సెప్టెంబరులో రానున్న మార్పులివే..!

ఆధార్‌-పాన్‌ అనుసంధానం, గ్యాస్‌ ధర, జీఎస్టీఆర్‌-1 ఫైలింగ్‌ సహా సెప్టెంబరులో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ కొత్త మార్పులు మీ రోజువారీ కార్యకలాపాలపై ప్రభావం చూపొచ్చు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో రానున్న కొన్ని ముఖ్యమైన మార్పులేంటో ఇప్పుడు చూద్దాం..

10. ఆల్‌ ది బెస్ట్ భవీనా.. ఒత్తిడి లేకుండా ఆడు..!
పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకం ఖాయం చేసిన టేబుల్‌ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్‌కు ప్రధాని మోదీ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. రేపు జరగబోయే తుదిపోరులో ఒత్తిడికి గురికావొద్దని సూచించారు. ‘అభినందనలు భవీనా పటేల్! అద్భుతంగా ఆడావు. రేపటి మీ విజయం కోసం దేశం మొత్తం ప్రార్థిస్తోంది. మీ వంతు ప్రయత్నించండి. ఏ మాత్రం ఒత్తిడికి తలొగ్గకుండా ఆడండి. మీ విజయాలు దేశ ప్రజలందరికీ స్ఫూర్తినిస్తాయి’ అని ట్విటర్ వేదికగా మోదీ ఆమెను ఉత్సాహపరిచారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని