Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం..

Updated : 04 Oct 2021 16:59 IST

1. వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి..!

ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన నోబెల్‌ బహుమతి వైద్యశాస్త్రంలో విశేష సేవలందించినందుకు ఈసారి ఇద్దరిని వరించింది. అమెరికాకు చెందిన డేవిడ్‌ జూలియస్‌, అర్డెమ్‌ పటాపౌటియన్‌లు సంయుక్తంగా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఉష్ణ గ్రాహకాలు, శరీర స్వర్శపై వీరు చేసిన పరిశోధనలకు నోబెల్‌ బహుమతి ఇస్తున్నట్లు నోబెల్‌ జ్యూరీ వెల్లడించింది.

2. చెరువుల పరిరక్షణకు లేక్స్‌ స్పెషల్‌ కమిషనర్‌: కేటీఆర్

హైదరాబాద్‌ పరిధిలోని చెరువుల పరిరక్షణకు మూడు రకాల ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి కేటీఆర్‌ శాసనసభలో వెల్లడించారు. సభ్యులు మాధవరం కృష్ణారావు, ప్రకాశ్‌గౌడ్‌, సుభాష్‌రెడ్డి, అక్బరుద్దీన్‌ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. సమగ్ర చెరువుల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా చేపట్టిన చర్యలను ప్రస్తావించారు. చెరువుల చుట్టూ ఫెన్సింగ్‌, వాకింగ్‌ ట్రాక్, సుందరీకరణ, మురుగు కాల్వల మళ్లింపు తదితర అంశాలను వివరించారు.

3. ఎయిడెడ్‌ పాఠశాలల విలీనంపై మధ్యంతర ఉత్తర్వులు

ఏపీలో ఎయిడెడ్‌ పాఠశాలల విలీనం ప్రక్రియపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎయిడెడ్‌ పాఠశాలల విలీనానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ఆర్డినెన్స్‌, జీవోలను సవాల్‌ చేస్తూ పలు విద్యాసంస్థలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. ఈ నెల 22లోపు అన్ని పిటిషన్లకు కౌంటర్లు దాఖలు చేయాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 28 వరకు విద్యా సంస్థలపై ఒత్తిడి చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది

4. 3 నెలల్లో గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలు: ఏపీపీఎస్సీ కార్యదర్శి

ఏపీలో గ్రూప్‌-1 మెయిన్స్‌ మూల్యంకనంపై ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు వివరణ ఇచ్చారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నట్లు తెలిపారు. 3 నెలల్లో మూల్యంకనాలు పూర్తి చేసి ఫలితాలిస్తామని స్పష్టం చేశారు. 190 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులకు వారంలో నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరలో 670 జూనియర్‌ అసిస్టెంట్స్‌ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని ఆయన వివరించారు.

5. ‘మా’ ఎన్నికలపై మంత్రి పేర్ని నాని కీలక ప్రకటన

‘మా’ ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఈ ఎన్నికలతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఏపీ ప్రభుత్వం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

6. తీన్మార్‌ మల్లన్నను మారుమూల సెల్‌లో ఉంచారు: ఎంపీ అర్వింద్‌

తీన్మార్‌ మల్లన్న జైలు నుంచి విడుదల కాగానే భాజపాలోకి స్వీకరిస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వెల్లడించారు. చంచల్‌గూడ జైలులో ఉన్న తీన్మార్ మల్లన్నను ములాఖత్ ద్వారా కలిసిన అర్వింద్‌ అక్కడే మీడియాతో మాట్లాడారు. పెట్టిన కేసులే మళ్లీ మళ్లీ పెట్టొద్దని హైకోర్టు చీవాట్లు పెట్టినా ప్రభుత్వం తీరు మార్చుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

7. వాయు కాలుష్యంపై దిల్లీ వార్‌.. 10పాయింట్ల వ్యూహం ఇదే!

దేశ రాజధాని నగరాన్ని ఊపిరాడనీయకుండా చేసే వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేజ్రీవాల్‌ ప్రభుత్వం పకడ్బందీ వ్యూహాలను అమలుచేస్తోంది. ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇప్పటికే సరి-బేసి విధానం సహా పలు చర్యలను చేపట్టిన అక్కడి ప్రభుత్వం.. తాజాగా ‘వింటర్‌ యాక్షన్‌ ప్లాన్‌’ పేరిట 10 పాయింట్ల ప్రణాళికను ప్రకటించింది.

8. కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం ఇవ్వాల్సిందే

కరోనా మృతుల కుటుంబాలకు పరిహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కొవిడ్‌తో చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం లేకున్నా పరిహారం అందించాలని ఆదేశించింది. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా పరిహారం అందించాలని పేర్కొంది.

* సాగు చట్టాలపై స్టే విధించాం.. ఇంకా ఈ నిరసనలేమిటి..?  * నీట్‌-2021 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించడం కుదరదు: సుప్రీంకోర్టు

9. లఖింపుర్‌ ఖేరీ వెళ్తున్నా.. పంజాబ్‌ సీఎం చన్నీ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరి ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్నానంటూ పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. ‘ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలు, రైతులకు అండగా ఉండేందుకు లఖింపుర్ ఖేరికి బయలుదేరుతున్నాను. ఈ మేరకు యూపీ ప్రభుత్వం నుంచి అనుమతి కోరాను’ అని పేర్కొన్నారు. 

మృతుల కుటుంబాలకు రూ.45 లక్షల పరిహారం

10. ‘అందరూ జీవితా రాజశేఖర్‌నే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు’

ప్రపంచంలో అందరూ జీవితా రాజశేఖర్‌ను ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారో అర్థం కావటం లేదని, తాము ఎవరూ చేయనని తప్పులు చేశామా? అని ప్రశ్నించారు. అక్టోబరు 10న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనరల్‌ సెక్రటరీగా ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమపై వస్తున్న విమర్శలకు చెక్‌ పెట్టేందుకు జీవిత విలేకరులతో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని