Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Updated : 03 Dec 2021 17:18 IST

1. స్పష్టంగా చెప్పాం.. అయినా తెరాస గందరగోళం..: పీయూష్‌ 

తెలంగాణ ప్రభుత్వంతో ముందుగా చేసుకున్న ఒప్పందం (ఎంవోయూ) ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు. బాయిల్డ్‌ రైస్‌ ఎంత కొంటారో స్పష్టం చేయాలంటూ తెరాస సభ్యుడు కె.కేశవరావు (కేకే) రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. సీఎం కేసీఆర్‌తోనూ మాట్లాడానని.. వానాకాలం పంట పూర్తిగా కొంటామని చెప్పారు. 

2. విదేశాల నుంచి హైదరాబాద్‌కు..12 మందికి కొవిడ్‌

ఒమిక్రాన్‌ భయాలు వెంటాడుతున్న వేళ విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వారిలో 12 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. నిన్న, ఇవాళ యూకే, కెనడా, అమెరికా, సింగపూర్‌ నుంచి వచ్చిన 12మంది ప్రయాణికులకు కొవిడ్‌-19 సోకినట్టు అధికారులు వెల్లడించారు. కొవిడ్‌ పాజిటివ్‌గా వచ్చిన 12 మందినీ టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపారు.

3. తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం!

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. విశాఖకు ఆగ్నేయంగా 420 కి.మీల దూరంలో..  ఒడిశా గోపాల్‌పూర్‌కు 530 కి.మీల దూరంలో ‘జవాద్‌’ తుపాను కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. గంటకు 25 కి.మీల వేగంతో తీరం వైపు కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉదయానికి ఉత్తర కోస్తాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.

4. థియేటర్‌లపై ఆంక్షలు అపోహే..: తలసాని

ప్రజలు థియేటర్లకు వెళ్లి ధైర్యంగా సినిమా చూడొచ్చని, కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ పేర్కొన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు, దర్శకులతో ఆయన భేటీ అయ్యారు. కరోనా థర్డ్‌వేవ్‌ వస్తుందన్న ఊహాగానాలు మొదలైన నేపథ్యంలో థియేటర్ల మూత, ఆక్యుపెన్సీ తగ్గింపు తదితర ప్రచారాలను నమ్మొదని మంత్రి తలసాని చెప్పారు. కరోనా దృష్ట్యా థియేటర్‌లపై ఆంక్షలు విధిస్తామన్న ప్రచారం అపోహేనని కొట్టిపారేశారు. 

5. పాకిస్థాన్ పరిశ్రమలపై నిషేధం విధించాలంటున్నారా..?

దేశ రాజధాని నగరం దిల్లీ వాయు కాలుష్య కోరల్లో చిక్కుకుంది. దాంతో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు శుక్రవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అలాగే టాస్క్‌ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్‌కు ప్రత్యేక అధికారాలు ఇచ్చినట్లు వెల్లడించింది.

6. ఆ వయసు వారికి బూస్టర్‌ డోసు ఇవ్వొచ్చు..!

కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ నేపథ్యంలో పలు దేశాలు బూస్టర్‌ డోసు (Booster Dose) పంపిణీ మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ 40ఏళ్ల వయసు పైబడినవారికి బూస్టర్‌ డోసును ఇచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని జీనోమ్‌ శాస్త్రవేత్తలు సిఫార్సు చేశారు. ఇందుకు సంబంధించి ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ సీక్వెన్సింగ్‌ కన్సార్టియం (INSACOG) విడుదల చేసిన వారాంతపు నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నారు.

7. చైనాకు ‘కీల్‌’ నొప్పి..!

డ్రాగన్‌ను ఎదుర్కొనేందుకు తైవాన్‌ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో భారత్‌ సహా పలు దేశాలు తైవాన్‌కు అండగా నిలిచినట్లు వార్తలొస్తున్నాయి. చైనాను తీవ్ర ఆందోళనకు గురిచేసే పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. తైవాన్‌ ఏకంగా సబ్‌మెరైన్ల నిర్మాణ ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తోంది. నవంబరు మధ్యలో తైవాన్‌ సబ్‌మెరైన్ల నిర్మాణానికి సంబంధించిన పనులు కీలక దశ దాటినందుకు ‘కీల్‌ లేయింగ్‌’ ఉత్సవాన్ని నిర్వహించింది. 

8. కేసుల పెరుగుదలకు తగ్గట్లు సిద్ధం కావాలి: డబ్ల్యూహెచ్‌వో  

కొత్త వేరియంట్‌ కేసుల పెరుగుదలను ఎదుర్కొనే సన్నద్ధతలో భాగంగా ఆసియా-పసిఫిక్ దేశాలు తమ ఆరోగ్య వ్యవస్థల సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలని, పౌరులకు వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహచ్‌వో) తాజగా సూచించింది. ‘సరిహద్దు నియంత్రణలు వైరస్‌ వ్యాప్తిని కొంత ఆలస్యం చేయగలవు. కానీ.. ప్రతీ దేశం కేసుల పెరుగుదలకు తగ్గట్లు సిద్ధం కావాలి’ అని పేర్కొంది. 

9. సూచీలకు మళ్లీ ఒమిక్రాన్‌ భయాలు!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. శుక్రవారం సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఒమిక్రాన్ భయాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాలు సూచీలను కిందకు లాగాయి. మార్కెట్లు ప్రారంభమైన తొలి గంటపాటు స్వల్ప లాభాల్లో ట్రేడయినా మధ్యాహ్నం వరకు కొంత ఫ్లాట్‌గా కదలాడాయి. అమ్మకాల ఒత్తిడి పెరగడంతో  మధ్యాహ్నం తర్వాత అంతకంతకూ దిగజారుతూ పోయాయి.

10. భారత్‌దే భవిష్యత్తు.. సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌ విశ్వాసం

ప్రముఖ మదుపరి, సాఫ్ట్‌బ్యాంక్‌ చీఫ్‌ మసయొషి సన్‌ భారత ఆర్థిక భవిష్యత్తుపై విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్‌కు మెరుగైన భవిష్యత్తు ఉందని.. ఇక్కడి యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు బాగా రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు భారత్‌లో మూడు బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టినట్లు వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని