Top Ten News @ 9 PM

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Updated : 18 Jul 2021 20:58 IST

1. కంటోన్మెంట్‌లో రోడ్ల సమస్య పరిష్కరించండి: వెంకయ్య

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ రోడ్ల మూసివేత సమస్యపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు స్పందించారు. రోడ్ల మూసివేత కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్‌కు ఉపరాష్ట్రపతి సూచించారు. ఈ సమస్యకు సంబంధించి ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. 

2. ఏపీపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ: విజయసాయి

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్న విషయాన్ని అఖిలపక్ష సమావేశంలో మరోసారి స్పష్టం చేశామని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ‘‘ఏపీపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ, పక్షపాత ధోరణి. పుదుచ్చేరికి ప్రత్యేక హోదా అని మేనిఫెస్టోలో ఎలా పెట్టారు. అదే హోదాను ఏపీకి ఎందుకివ్వరని కేంద్రాన్ని అడిగాం. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇవ్వాలని కోరాం’’ అని విజయసాయి తెలిపారు.

3. పోటీ పరీక్షలు ప్రాంతీయ భాషల్లోనే ఉండాలి: కేటీఆర్‌

కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని పోటీ పరీక్షలు ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని కేంద్ర మంత్రి జితేందర్‌సింగ్‌కు తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. పోటీ పరీక్షలను కేవలం హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో మాత్రమే నిర్వహిస్తున్నారని, హిందీ, ఇంగ్లిష్‌ మాధ్యమం చదువుకోలేని విద్యార్థులపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తోందని మంత్రి కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు.

4. అందుకే దేవేందర్‌ గౌడ్‌ను కలిశాం: రేవంత్‌రెడ్డి

తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవేందర్‌ గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు.  ‘‘ దేవేందర్‌ గౌడ్‌ సలహాలు సూచనలు తీసుకుంటాం. దారితప్పిన తెలంగాణను పట్టాలు ఎక్కించాలంటే అనుభవం కావాలి. జైపాల్‌ రెడ్డి, దేవేందర్‌ గౌడ్‌ రాజకీయ విలువలకు ప్రతీకలు. కేసీఆర్‌ వ్యతిరేక పునరేకీకరణలో అందరినీ కలుపుకొంటాం. అందులో భాగంగానే దేవేందర్‌గౌడ్‌ను కలిశాం’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

కేటీఆర్‌.. వరద సాయం ఎప్పుడిస్తారు: దాసోజు

5. కాలు బయట పెట్టలేం.. వాసన పీల్చలేం

నగరంలోని లింగోజిగూడ డివిజన్‌ భాగ్యనగర్ ఫేస్‌-2 కాలనీ వాసులు డ్రైనేజీ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గత 14నెలలుగా ఇబ్బందులు పడుతున్నామని.. డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని కలిసినా సమస్య పరిష్కరించడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతం కావడంతో వర్షాకాలం వచ్చిందటే చాలు..  డ్రైనేజీలు పొంగిపొర్లి మోకాళ్ల లోతు వరకు రోడ్లపైకి నీరు చేరుతుందన్నారు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొందని వాపోయారు.

6. Sedition: ఆరేళ్లలో 326 రాజద్రోహం కేసులు!

స్వాతంత్య్రోద్యమాన్ని అణచివేయడానికి బ్రిటిషర్లు తీసుకొచ్చిన రాజద్రోహ చట్టం అవసరం ఇప్పటికీ ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఈ చట్టం మరోసారి చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గడిచిన ఆరేళ్లలో దేశవ్యాప్తంగా 326 రాజద్రోహం కేసులు నమోదైనట్లు కేంద్ర హోంశాఖ తాజా నివేదిక వెల్లడించింది. వీటిలో అత్యధికంగా అస్సాంలోనే 54 కేసులు నమోదయ్యాయి. 

7. తప్పుడు సమాచారంతో జనాన్ని చంపేస్తున్నారు!

కరోనాపై తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా సామాజిక మాధ్యమాలు జనాన్ని చంపేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ శుక్రవారం వ్యాఖ్యానించారు. టీకాలపై దుష్ప్రచారం చేస్తున్న ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలకు మీరేమైనా సందేశం ఇస్తారా అని బైడెన్‌ను విలేకరులు ప్రశ్నించినప్పుడు ‘‘వారు ప్రజల్ని చంపేస్తున్నారు. టీకాలు వేసుకోకపోవడమే ఇప్పుడు పెద్ద వ్యాధిగా మారింది’’ అని అన్నారు. 

8. ATM: లావాదేవీలపై అదనపు భారం..!

వచ్చే జనవరి నుంచి ఏటీఎం లావాదేవీలు మరింత భారం కానున్నాయి. నెలవారీ ఉచితంగా అనుమతించిన వాటికి మించి చేసే నగదు, నగదేతర ఏటీఎం లావాదేవీపై ఛార్జీలు పెంచుకునేందుకు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) ఇటీవల బ్యాంకులకు అనుమతిచ్చింది.  బ్యాంకులు ప్రస్తుతం వినియోగదారుల నుంచి ఒక్కో అదనపు లావాదేవీకి 20 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నాయి.

Amazon: ప్రైమ్‌డే నాడు 2,400 సరికొత్త ఉత్పత్తులు!

9. తెలంగాణలో మరో కొత్త పథకం

తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ సాధికారత పథకానికి ‘తెలంగాణ దళిత బంధు’ పేరును ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేశారు. రాష్ట్రంలో దళితుల సమగ్ర అభివృధ్ధి కోసం సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పైలట్‌ ప్రాజెక్టు కింద ముందుగా ఒక నియోజకవర్గంలో ఈ పథకం అమలు చేయనున్నారు. తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన సింహగర్జన సభ మొదలుకొని, తాను ఎంతగానో అభిమానించిన రైతు బీమా పథకం వరకు కరీంనగర్‌ జిల్లా నుంచే అనేక పథకాలను సీఎం ప్రారంభించారు. 

10. INDvsSL: గబ్బర్‌సేన లక్ష్యం 263

తొలి వన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక.. టీమ్‌ఇండియా ముందు మంచి స్కోరే నిర్దేశించింది. మొత్తం 50 ఓవర్లు బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. చివర్లో టెయిలెండర్లు కరుణరత్నె 43 (నాటౌట్‌) పరుగులతో ధాటిగా ఆడి లంక జట్టుకు పోరాడే స్కోర్‌ అందించారు.

INDvsSL లైవ్‌బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు